Tuesday, April 16, 2024
HomeTrending Newsఅభివృద్ధికి విపక్షాల అడ్డుపుల్లలు: సిఎం

అభివృద్ధికి విపక్షాల అడ్డుపుల్లలు: సిఎం

Conspiracies: రాష్ట్రంలో అభివృద్ధి పనులు ముందుకు సాగనీయకుండా ప్రతిపక్ష నేతలు రకరకాల కుట్రలు పన్నుతున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు.  రాష్ట్ర ప్రభుత్వానికి రుణాలు ఇవ్వకూడదని, కేంద్రం నుంచి డబ్బులు రాకూడదని, కేసుల ద్వారా అడ్డుకోవాలని, తద్వారా అభివృద్ధి పనులు ఆగిపోవాలనే ఒక అజెండాతో ప్రతిపక్షాలు పనిచేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం, మరమ్మతు పనుల ప్రగతిపై రహదారులు భవనాలు, పంచాయతీ రాజ్‌ గ్రామీణాభివృద్ధిశాఖ, నిడా, పురపాలక, పట్టణాభివృద్ధి, గిరిజన సంక్షేమశాఖల  అధికారులతో తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో సిఎం సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ విపక్షాలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా సడలని సంకల్పంతో అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నామని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకున్నరంగాల్లో అభివృద్ధి పనులకు ఎక్కడా నిధుల లోటు రాకుండా, చెల్లింపుల సమస్య లేకుండా చూసుకుంటూ ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలను పూర్తిచేస్తున్నామని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా సిఎం పలు సూచలను చేశారు:

  • రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల మరమ్మత్తులు చురుగ్గా సాగుతున్నాయి
  • నాడు–నేడు కింద చేపడుతున్న పనుల్లో మంచి పురోగతి కనిపిస్తోంది
  • ఆసంపూర్తిగా ఉన్న రోడ్లు, బ్రిడ్జిలు, ఆర్వోబీలు, ఫ్లై ఓవర్లను పూర్తి చేసేలా తక్షణమే చర్యలు తీసుకోవాలి
  • అసంపూర్తిగా ఉన్న రోడ్లను పూర్తి చేయడమే కాకుండా, గుంతలు లేని రోడ్లను తీర్చిదిద్దాలి
  • ఇప్పుడు చేపడుతున్న పనులే కాకుండా, క్రమం తప్పకుండా నిర్వహణ, మరమ్మతులపై కార్యాచరణ సిద్ధం చేయాలి
  • గిరిజన సంక్షేమశాఖలో కూడా రోడ్ల నిర్మాణం, మరమ్మతులపై దృష్టిపెట్టాలి
  • కార్పొరేషన్లు, మున్పిపాల్టీలలో చురుగ్గా రహదారుల మరమ్మతులు చేపట్టాలి
  • జులై 15 కల్లా గుంతలు పూడ్చాలి, జులై 20 న ఫొటో గ్యాలరీలు పెట్టాలి

ఈ సమీక్షా సమావేశంలో ఉపముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి) బూడి ముత్యాలనాయుడు, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఆర్‌ అండ్‌ బి మంత్రి దాడిశెట్టి రామలింగేశ్వరరావు(రాజా), సీఎస్‌ సమీర్‌ శర్మ, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి, ఆర్‌ అండ్‌ బి ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి కాంతిలాల్‌ దండే, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ కుమార్, ఆర్ధికశాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Also Read : టిడ్కో ఇల్లు త్వరగా అందించాలి: సిఎం జగన్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్