Thursday, March 19, 2026
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్బకాయిలు చెల్లించండి : పవన్

బకాయిలు చెల్లించండి : పవన్

రైతులకు ధాన్యం బకాయిలు నెలాఖరులోగా చెల్లించాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని  డిమాండ్ చేశారు, లేని పక్షంలో తమ పార్టీ రైతులకు అండగా పోరాటం చేస్తుందని హెచ్చరించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రెండున్నర లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి నిరుద్యోగులను మోసం చేశారని, అదే విధంగా ఇప్పుడు రైతులను కూడా నమ్మించి మోసం చేస్తున్నారని పవన్ ఆరోపించారు. కేవలం మూడు రోజుల్లోనే ధాన్యం బకాయిలు చెల్లిస్తామంటూ ఎన్నికల సమయంలో రైతులకు హామీ ఇచ్చిన వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రోజులు, వారాలు, నెలలు గడుస్తున్న రైతులకు డబ్బులు చెల్లించడంలేదని వివరించారు. ఈ మేరకు పవన్ ఓ లేఖను విడుదల చేశారు.

ధాన్యం కొనుగోలుకు సంబంధించిన వివరాలు, లెక్కలను ప్రభుత్వ వెబ్ సైట్ నుంచి ఎందుకు తొలగించారో చెప్పాలని పవన్ ప్రశ్నించారు. ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన రైతులకే దాదాపు 1800కోట్ల రూపాయల బకాయులు రావాల్సి ఉందన్నారు. బకాయిల కోసం నిలదీస్తున్న రైతులను వైఎస్సార్సీపీ  ప్రజా ప్రతినిధులు బెదిరించడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు.

రబీ డబ్బులు వస్తేనే ఖరీఫ్ పంటకు పెట్టుబడి కోసం ఉపయోగపడతాయని, అవి రాకపోతే వ్యవసాయ పనులు ఎలా మొదలు పెడతారని పవన్ ప్రభుత్వాన్ని అడిగారు. రైతు భరోసా కేంద్రాలనుంచి విత్తనాలు సరఫరా చేసే విషయంలోనూ ఏ పార్టీ వారనే లెక్కలు చూస్తున్నారని, ఇది సరైన పధ్ధతి కాదన్నారు. నకిలీ విత్తనాలు అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు.  రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతుల పక్షాన పోరాడడానికి జనసేన ఎప్పుడూ సిద్ధంగా ఉందని పవన్ హామీ ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular