Tuesday, April 16, 2024
HomeTrending News12మంది ఎమ్మెల్యేల పై పిసిసి ఫిర్యాదు

12మంది ఎమ్మెల్యేల పై పిసిసి ఫిర్యాదు

పార్టీ ఫిరాయింపులతో తన అధికారాన్ని కేసీఆర్ పదిలం చేసుకోవాలనుకున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. అందుకె 2014 నుంచి పాలనను గాలికి వదిలి ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసే పనిలో పడ్డారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇతర పార్టీలకు ఫిరాయించిన 12మంది ఎమ్మెల్యేల పై మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో పిసిసి నేతలు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు మహేష్ కుమార్ గౌడ్ , సంపత్ కుమార్ ,గడ్డం ప్రసాద్ , మల్లు రవి, మల్రెడ్డి రంగారెడ్డి, చామల కిరణ్ రెడ్డి రెడ్డి ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…2018లో కేసీఆర్ పార్టీలో 88 మంది ఎమ్మెల్యేలు గెలిచారని, హామీలు అమలు చేయాలని జనం సంపూర్ణ మెజారిటీ ఇచ్చారని గుర్తు చేశారు.

అయినా కేసీఆర్ ఆలోచనలో మార్పు రాలేదని, రెండోసారి అధికారంలోకి వచ్చినా ఫిరాయింపులను కొనసాగించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఒక దళిత నాయకుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే చూసి కేసీఆర్ ఓర్వలేకపోయారని, అందుకే కాంగ్రెస్ ఎమ్మెల్యేల పిరాయింపులను ప్రోత్సహించారని మండిపడ్డారు. పిరాయింపు ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ పార్టీ వివిధ సందర్భాల్లో పిర్యాదు చేసిందని, ఫిర్యాదులపై స్పీకర్ న్యాయబద్ధంగా వ్యవహరించలేదని ఆరోపించారు. పార్టీ ఫిరాయించిన శాసనసభ్యులకు లంచంగా ప్రభుత్వం పదవులు, ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చిందన్నారు.

ఎమ్మెల్యేల కొనుగోలుపై పైలట్ రోహిత్ రెడ్డి మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారని, ఈ కేసులో కోర్టు పరిధిలో ఉంచాల్సిన ఆధారాలు సీఎం వద్దకు చేరాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర పరిధిలో ఉన్న ఈ కేసును కోర్టు సీబీఐ విచారణకు ఆదేశించిందని, పార్టీ ఫిరాయించిన 12 మందిపై కూడా విచారణ చేయాలని డిమాండ్ చేశారు. పోలీస్ స్టేషన్ కు వస్తే ఉన్నతాధికారులు లేకపోవడం దురదృష్టకరమని అసంతృప్తి వ్యక్తం చేశారు. 455 ఎఫ్.ఐ. ఆర్. తో పాటు మేం ఇచ్చిన ఆధారాలను కూడా పరిశీలించి విచారణ చేపట్టాలని, కేసీఆర్ ఫిరాయింపు రాజకీయానికి సమాధి కట్టాలన్నారు. ప్రతిపక్షాలు లేకుండా చేయాలన్న కేసీఆర్ కుట్రను ఛేదించాలని, 2014 నుంచి ఇప్పటివరకు జరిగిన ఫిరాయింపులపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని కోరారు. పోలీస్ స్టేషన్ లొనే కాకుండా డీజీపీ, ఈడీ, సీబీఐ డైరెక్టర్ కు కూడా వివరాలతో పిర్యాదు చేస్తామని తెలిపారు. విచారణ వ్యవస్థలు సరిగా స్పందించకపోతే కోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. అవసరమైతే ఫిరాయించిన ఎమ్మెల్యేలు మళ్లీ చట్టసభల్లో అడుగు పెట్టకుండా రాజకీయ పోరాటం చేయడానికీ వెనకాడమని రేవంత్ రెడ్డి ప్రకటించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్