Friday, October 18, 2024
HomeTrending NewsWest Asia: భారత రాజకీయాల్లో ఇజ్రాయల్ యుద్ధం

West Asia: భారత రాజకీయాల్లో ఇజ్రాయల్ యుద్ధం

ఇజ్రాయల్ – హమాస్ గొడవలు ఇలాగే కొనసాగితే భారత దేశ సార్వత్రిక ఎన్నికల్లో ప్రచార అస్త్రంగా మారే సూచనలు ఉన్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో లోకసభ ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమాసియా సంక్షోభం మొదలైన రోజు నుంచి పరిశీలిస్తే మన దేశంలో రాజకీయ పార్టీలు కూడా ఇజ్రాయల్ – పాలస్తీనా వర్గాలుగా విడిపోతున్నాయి.

హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయల్ మీద దాడి చేసిన మొదటి రోజు ప్రధానమంత్రి నరేంద్రమోడి అమాయకుల ఉచకోతను తీవ్రంగా ఖండించారు. భారత్ ఇజ్రాయల్ కు అండగా ఉంటుందని, టెర్రరిజం ఉపేక్షించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఆ రోజు భారత ప్రజలు అందరు యూదులకు సంఘీభావం తెలిపారు.

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధి కూడా ఇజ్రాయల్ మీద హమాస్ దాడుల్ని ఖండించారు. ఇతర ప్రాంతీయ పార్టీలు కూడా ఉగ్రదాడిపై ఆందోళన వ్యక్తం చేశాయి. రెండు రోజులు గడవగానే క్రమంగా సీన్ మారింది. పాలస్తీనా వాసులు ఆత్మరక్షణ కోసం దాడులు చేశారని రాహుల్ అన్నారు. కాంగ్రెస్ పాలస్తీనా వాసులకు అండగా ఉంటుందన్నారు.

ఈ తరుణంలో భారత విదేశాంగ ప్రతినిధి అరిందం బాగ్చి మాట్లాడుతూ పాలస్తీనా హక్కులను కాపాడేందుకు భారత్ కట్టుబడి ఉందన్నారు. గాజాకు మానవతా సాయం చేసేందుకు భారత్ సిద్దమని ప్రధాని తెలిపారు. కాంగ్రెస్ ఎంపి శశి థరూర్ హమాస్ దాడులను తప్పుపట్టినందుకు సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు ఎదుర్కొన్నారు.

తాజాగా ఐక్యరాజ్యసమితిలో గాజాకు అనుకూలంగా ప్రవేశపెట్టిన తీర్మానంపై భారత్ గైర్హాజరైంది. దీనిపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధి మండిపడ్డారు. భారత్ గైర్హాజరును కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని, అదే సమయంలో ఇజ్రాయల్ మీద హమాస్ దాడిని ఖండిస్తున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో లబ్ది కోసమా అన్నట్టు కాంగ్రెస్…పాలస్తీనాకు మద్దతుపై పదే పదే ప్రకటనలు చేస్తోంది.

భారత విదేశాంగ విధానాన్ని భ్రష్టు పట్టించిన కాంగ్రెస్ ఇప్పుడు కూడా అదే కొనసాగిస్తోంది. ప్రధానిగా pv నరసింహారావు పుణ్యాన ఇజ్రాయల్ తో దౌత్య సంబంధాలు బలపడ్డాయి. నెహ్రు యేతర కుటుంబానికి చెందిన నేత కావటం.. విదేశాంగ మంత్రిగా ఉన్న అనుభవంతో ఇజ్రాయల్ దౌత్య కార్యాలయం అధికారికంగా భారత్ లో ప్రారంభించేందుకు పివి నరసింహారావు చొరవ తీసుకున్నారు. అప్పటి వరకు భారత్ లో ఇజ్రాయిల్ దౌత్య కార్యాలయం లేదు. ఇజ్రాయల్లో పర్యటించిన మొదటి ప్రధానిగా మోడీ రెండు దేశాల మధ్య బలమైన సంబంధాలకు పునాదులు వేశారు.

కార్గిల్ యుద్దంలో ఇజ్రాయల్ డ్రోన్లు ఆదుకోపోతే ఆ రోజు మనకు సైనిక నష్టం అపారంగా ఉండేది. కాశ్మీర్ నుంచి ఈశాన్యం వరకు దేశం ఉగ్రవాదులతో అనేక సమస్యలు ఎదుర్కొంటోంది. అయినా కాంగ్రెస్ వైఖరిలో మార్పు లేదు. మైనారిటీలను తప్పుదారి పట్టించే విధంగా హమాస్ వ్యవహారాన్ని ఎన్నికల్లో వాడుకోవాలని చూస్తోంది. అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో రెండు చోట్ల గెలిచినా కాంగ్రెస్ మరింత బలంగా పాలస్తీనా వాదన చేస్తుంది. మరోవైపు బిజెపి హామాస్ ఉగ్రదాడిని ఖండించింది. పాలస్తీనా పేరుతో ఉగ్రవాదులు చెలరేగిపోతున్నారని బిజెపి నేతలు ఆరోపించారు.

Uttarkhand Wins Bjp

కాశ్మీర్ లో 370 ఆర్టికల్ పునరుద్దరిస్తామని, పాలస్తీనా పేరుతో హమాస్ ఉగ్రవాదులకు మద్దతు, కేరళలో ఇస్లామిక్ ఉగ్రవాదం జడలు విప్పుతున్నా… పట్టనట్టు వ్యవహరించటం తదితర అంశాలు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కు నష్టం చేకూర్చే ప్రమాదం ఉంది. కాంగ్రెస్ ఎంత బలంగా ఈ అంశాలు ప్రస్తావిస్తే బిజెపికి అంతగా మేలు చేకూరుతుందని విశ్లేషకులు అంటున్నారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్