Friday, April 19, 2024
HomeTrending NewsSecretariat: సచివాలయానికి ప్రతిష్టాత్మక గ్రీన్ బిల్డింగ్ అవార్డ్

Secretariat: సచివాలయానికి ప్రతిష్టాత్మక గ్రీన్ బిల్డింగ్ అవార్డ్

డా.బి.ఆర్ అంబేద్కర్ నూతన సెక్రటేరియట్ కు ప్రతిష్టాత్మక ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ అవార్డ్ దక్కింది. భారత దేశంలోనే మొట్ట మొదటి గోల్డ్ రేటెడ్ సెక్రటేరియట్ బిల్డింగ్ కాంప్లెక్స్ గా రికార్డుల్లోకెక్కింది. సోమవారం నాడు సెక్రటేరియట్ లో ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ వారు రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కి ఈ అవార్డు ప్రదానం చేశారు.

అత్యంత విశాలంగా,అధునాతన హంగులతో కొత్త సెక్రటేరియట్ పర్యావరణహితంగా నిర్మించబడిందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఈ క్రెడిట్ అంతా ప్రకృతి ప్రేమికుడైన ముఖ్యమంత్రి కేసిఆర్ కే దక్కుతుందన్నారు. కేసిఆర్ చేపట్టిన హరితాహారం కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో గ్రీనరీ 7.7% కు పెరిగిందని గుర్తు చేశారు. వారి ఆలోచనలకు అనుగుణంగానే సెక్రటేరియట్ నిర్మాణం జరిగిందని తెలిపారు. రానున్న రోజుల్లో సోలార్ విద్యుత్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. త్వరలోనే ప్లాటినం అవార్డు కూడా గెలుచుకుంటామని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలోనే మొట్ట మొదటి గోల్డ్ రేటెడ్ సెక్రటేరియట్ బిల్డింగ్ కాంప్లెక్స్ గా గుర్తింపు రావడం పట్ల తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని మంత్రి వేముల హర్షం వ్యక్తం చేశారు. ఈ అవార్డు రావడానికి సీఎం కేసిఆర్ గారి ఆదేశానుసారం ఇందులో నిమగ్నమై పనిచేసిన ఈఎన్సి గణపతి రెడ్డి టీం కు మంత్రి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ప్రతిష్టాత్మక అవార్డు,అందుకు సంబంధించిన సర్టిఫికేట్ ప్రదానం చేసిన ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ వారికి మంత్రి దన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సెక్రెటరీ శ్రీనివాస రాజు,ఈఎన్సి గణపతి రెడ్డి,ఎస్.ఈ లింగారెడ్డి, ఈ.ఈలు శశిధర్,శ్రీనివాస్,డి.ఈ దుర్గ ప్రసాద్ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్