Thursday, March 28, 2024
HomeTrending Newsడిసెంబర్ లోగా విద్య, వైద్య శాఖలో పదోన్నతులు : బొత్స

డిసెంబర్ లోగా విద్య, వైద్య శాఖలో పదోన్నతులు : బొత్స

కంట్రిబ్యూట‌రీ పెన్ష‌న్ స్కీము (సి.పి.ఎస్‌.) కంటే మెరుగైన పథకాన్ని  ఉద్యోగుల‌కు అందించాలని సిఎం జ‌గ‌న్ మంత్రివ‌ర్గ ఉప‌సంఘాన్ని ఆదేశించార‌ని, రెండు నెల‌ల్లోనే దీన్ని ఫైనల్ చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ చెప్పారు. ఉద్యోగుల స‌మ‌స్య‌లు చ‌ర్చ‌ల ద్వారానే ప‌రిష్కార‌మ‌వుతాయ‌ని మంత్రి పేర్కొన్నారు. సి.పి.ఎస్‌.ర‌ద్దుపై త‌మ పార్టీ హామీ ఇచ్చిన విష‌యాన్ని తాము కాద‌న‌డం లేద‌ని చెప్పారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఎన్నిక‌ల ముందు ఇచ్చిన హామీల్లో 95శాతం హామీలు నెర‌వేర్చింద‌ని, అందులో 5 శాతం హామీలు మిగిలి వున్నాయ‌ని, అందులో సి.పి.ఎస్‌.ర‌ద్దు ఒక‌ట‌ని పేర్కొన్నారు. సి.పి.ఎస్‌.కు ప్ర‌త్యామ్నాయంగా ప‌లు ప‌రిష్కారాల‌ను ఉద్యోగుల ముందు వుంచామ‌ని మంత్రి చెప్పారు. స్థానిక జిల్లాప‌రిష‌త్ స‌మావేశ మందిరంలో శ‌నివారం జ‌రిగిన‌ ఏ.పి. ప్ర‌భుత్వ ఉద్యోగుల సంఘం 4వ జిల్లా మ‌హాస‌భ‌ల్లో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా బొత్స మాట్లాడుతూ రాష్ట్రంలోని విద్య‌, వైద్య శాఖ‌ల ఉద్యోగుల‌కు అన్ని స్థాయిల్లోని వారికి వ‌చ్చే మూడు నెల‌ల్లో ప‌దోన్న‌తులు క‌ల్పిస్తామ‌ని భరోసా ఇచ్చారు. తమ ప్ర‌భుత్వం విద్య‌, వైద్య రంగాల‌కు ఎంతో ప్రాధాన్య‌త ఇస్తున్న విష‌యాన్ని గుర్త‌చేస్తూ సిఎంకు విద్య‌, వైద్యం రెండు క‌ళ్ల వంటివ‌ని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని పి.హెచ్‌.సి.లు, సి.హెచ్‌.సిల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీ వుండ‌కుండా నిర్ణీత కాల‌వ్య‌వ‌ధిలో నోటిఫికేష‌న్‌లు జారీచేసి పోస్టుల‌న్నీ భ‌ర్తీ చేయాల‌ని సి.ఎం. ఆదేశాలిచ్చార‌ని తెలిపారు. అదేవిధంగా తన విద్యాశాఖ‌లోనూ టీచ‌ర్ నుంచి ప్రొఫెస‌ర్ వ‌ర‌కు అన్ని స్థాయిల్లో బోధ‌న సిబ్బందికి ప‌దోన్న‌తులు క‌ల్పిస్తామ‌న్నారు. డిసెంబ‌రులోగా విద్యాశాఖ‌లో ప‌దోన్న‌తులు పూర్తిచేస్తామ‌న్నారు.

రాష్ట్రంలో 25 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు వున్నార‌ని, వీరిలో కోర్టు నిబంధ‌న‌ల మేర‌కు అర్హులైన వారంద‌రినీ రెగ్యుల‌ర్ చేయాల‌ని ముఖ్య‌మంత్రి ఇప్ప‌టికే ఆదేశాలు జారీచేశార‌ని చెప్పారు. నెల‌రోజుల్లో కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యుల‌రైజేష‌న్‌పై నిర్ణ‌యం వుంటుంద‌న్నారు. రాష్ట్రంలోని ఆర్టీసీ ఉద్యోగుల‌కు కొత్త పి.ఆర్‌.సి. ప్ర‌కారం జీతాల చెల్లింపు వ‌చ్చే నెల ఒక‌టో తేదీ నుంచి ప్రారంభ‌మ‌వుతుంద‌ని మంత్రి వెల్ల‌డించారు. త‌మ‌ది ఉద్యోగుల అనుకూల ప్ర‌భుత్వ‌మ‌ని,  వారి ప్ర‌యోజ‌నాలు దెబ్బ‌తీసేలా ఆలోచ‌న చేయ‌బోమ‌న్నారు. ఉద్యోగులు, ప్ర‌భుత్వం వేరు కాద‌ని వారు ప్ర‌భుత్వంలో భాగ‌మేన‌ని చెప్పారు. ఉద్యోగుల‌కు ఇవ్వాల్సిన డి.ఏ. లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ త‌దిత‌ర అంశాల్లో త్వ‌ర‌లో ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంటుంద‌న్నారు.

స‌మావేశంలో జిల్లాప‌రిష‌త్ ఛైర్మ‌న్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు, స్థానిక ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి, ఏ.పి. ప్ర‌భుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్య‌క్షుడు కె.ఆర్‌.సూర్య‌నారాయ‌ణ, జిల్లా అధ్య‌క్షుడు పి.రామ‌చంద్ర‌రావు, కార్య‌ద‌ర్శి కంది వెంక‌ట‌ర‌మ‌ణ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Also Read విలీనంపై క్షేత్రస్థాయి పర్యటన: బొత్స

RELATED ARTICLES

Most Popular

న్యూస్