Wednesday, June 17, 2026
HomeTrending NewsQnet:క్యూ నెట్ బాధితులకు అండగా ప్రభుత్వం - మంత్రి తలసాని

Qnet:క్యూ నెట్ బాధితులకు అండగా ప్రభుత్వం – మంత్రి తలసాని

క్యూ నెట్ బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ భరోసా ఇచ్చారు. సోమవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను వెస్ట్ మారేడ్ పల్లిలోని తన నివాసంలో క్యూ నెట్ బాధితులు కలిసి తమకు న్యాయం చేయాలని కోరారు. ఇటీవల అగ్నిప్రమాదం జరిగిన స్వపంలోక్ కాంప్లెక్స్ లో కొనసాగుతున్న క్యూ నెట్ అనే సంస్థలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, ఆకర్షణీయమైన ఆదాయం లభిస్తుందని మాయమాటలు చెప్పి తమ వద్ద ఒకొక్కరి నుండి లక్షన్నర నుండి 3 లక్షల రూపాయల వరకు వరంగల్, ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్ తదితర జిల్లాలకు చెందిన సుమారు 60 మంది వద్ద నుండి వసూలు చేశారని మంత్రికి వివరించారు.

అగ్నిప్రమాదంలో మరణించిన 6 గురు కూడా తమ లాగే క్యూ నెట్ లో డబ్బులు చెల్లించారని తెలిపారు. తమకు మంచి భవిష్యత్ లభిస్తుందన్న నమ్మకంతో తమ తల్లిదండ్రులు, బంగారం, ఆస్తులు తనఖా పెట్టి డబ్బులు కట్టారని మంత్రికి మొరపెట్టుకున్నారు. స్పందించిన మంత్రి వెంటనే క్యూ నెట్ నిర్వహకులపై తగు చర్యలు తీసుకుంటామని, మీరు చెల్లించిన డబ్బులను మీకు ఇప్పించే విధంగా చూస్తామని మంత్రి వారికి హామీ ఇచ్చారు. క్యూ నెట్ నిర్వహకులపై వెంటనే కేసు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవాలని మహంకాళి పోలీసు అధికారులను ఆదేశించారు. అగ్నిప్రమాదంలో ఎంతో భవిష్యత్ ఉన్న 6 గురు మరణించడం చాలా దురదృష్టకరం అని మంత్రి విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి ప్రకటించిన ఒక్కో కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆర్ధిక సహాయం మంజూరైనాయని, త్వరలోనే బాధిత కుటుంబాలకు అందజేస్తామని మంత్రి చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular