ప్రపంచ వాణిజ్య రాజధాని న్యూయార్క్ నగరంలో స్థిరపడిన తెలుగు, తెలంగాణ ప్రవాసుల సంస్కృతి, సామాజిక ఐక్యతకు కృషి చేస్తున్న న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (నైటా) తమ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంది. 2026 సంవత్సరానికి గాను సంస్థ నూతన అధ్యక్షుడిగా ప్రముఖ ఫార్మసిస్ట్ రవీందర్ కోడెల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
శనివారం (06/12/2025) న్యూయార్క్లో జరిగిన ప్రత్యేక సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. రాబోయే ఏడాది పాటు నైటా కార్యకలాపాలకు రవీందర్ కోడెల నాయకత్వం వహించనున్నారు.

సంస్థ నేపథ్యం, లక్ష్యాలు:-
అమెరికాలో వేల సంఖ్యలో ఉన్న తెలుగు, తెలంగాణ ఎన్.ఆర్.ఐలు తమ ప్రాంతీయ సంస్కృతిని కాపాడుకుంటూ, ఒక సామాజిక సమూహంగా కలిసి ఉండే లక్ష్యంతో ఆరేళ్ల క్రితం నైటాను ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటివరకూ ఆరుసార్లు ఏర్పాటైన కార్యవర్గాలు వివిధ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాయి. ఈ క్రమంలో, సంస్థ ఏడవ అధ్యక్షుడిగా రవీందర్ కోడెల బాధ్యతలు స్వీకరించనున్నారు.
హాజరైన ప్రముఖులు:-
ఈ ఎన్నికల ప్రక్రియలో స్థానిక ప్రజాప్రతినిధులు, కమ్యూనిటీ లీడర్లు పాల్గొన్నారు. న్యూయార్క్ అసెంబ్లీ సభ్యురాలు జెన్నిఫర్ రాజ్ కుమార్, ప్రముఖ ఎన్నారై పైళ్ల మల్లారెడ్డి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరై నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు.

నూతన అధ్యక్షుడు రవీందర్ కోడెల మాట్లాడుతూ, గతంలో తాను నైటాలో సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్ వంటి హోదాల్లో చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. కొత్త కార్యవర్గ సభ్యుల సహకారంతో సంస్థ లక్ష్యాలను మరింత ముందుకు తీసుకువెళ్తామని, రానున్న ఏడాదిలో మరింత విస్తృతమైన సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు.
న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం కార్యకలాపాలు, సభ్యత్వం గురించిన పూర్తి వివరాలను సంస్థ New York Telangana Telugu Association-
అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు.

