Friday, March 29, 2024
HomeTrending Newsప్రధాని మోడికి.. రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

ప్రధాని మోడికి.. రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

ఎనిమిదేళ్లుగా హామీల అమలుకు చొరవ చూపకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. రాజకీయ ప్రయోజనాలే తప్ప రాష్ట్ర ప్రయోజనాలపై కేసీఆర్ దృష్టి పెట్టలేదన్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీకి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. విభజన చట్టం, పార్లమెంట్ వేదికగా తెలంగాణకు ఇచ్చిన హామీలపై లేఖలో ప్రస్తావన దేశ ప్రధానిగా పార్లమెంట్ వేదికగా చేసిన చట్టాలు, ఇచ్చిన హామీలను నెరవేర్చడం మీ ధర్మమని లేఖలో పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్ర మోడీకి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
విషయం :
విభజన చట్టం, పార్లమెంట్ వేదికగా తెలంగాణకు ఇచ్చిన హామీలు అమలు కాకపోవడం… ఎనిమిదేళ్లుగా తెలంగాణకు జరుగుతోన్న అన్యాయం గురించి…
భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వం నిరంతర ప్రక్రియ. పార్లమెంట్ వేదికగా చేసే చట్టాలు, ఇచ్చే హామీలు కచ్చితంగా నెరవేర్చడం ప్రభుత్వ బాధ్యత. అప్పుడే చట్టసభల పట్ల, ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల ప్రజల్లో విశ్వసం కొనసాగుతుంది. ఏపీ పునర్ విభజన చట్టంలో పొందు పరచిన అంశాలతో పాటు, పార్లమెంట్ వేదికగా తెలంగాణకు ఇచ్చిన హామీలు నెరవేరక పోవడం పట్ల తెలంగాణ సమాజంలో అసంతృప్తి నెలకొంది. ఎనిమిదేళ్లుగా ఈ హామీల అమలుకు చొరవ తీసుకోవాల్సిన టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ వచ్చింది. రాజకీయ ప్రయోజనాలే తప్ప రాష్ట్ర ప్రయోజనాలపై కేసీఆర్ దృష్టి పెట్టలేదు. ఇప్పుడు కూడా వివాదాలు రాజేసి పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దేశ ప్రధానిగా పార్లమెంట్ వేదికగా చేసిన చట్టాలు, ఇచ్చిన హామీలను నెరవేర్చడం మీ ధర్మం. ఇప్పటికీ ఆ దిశగా ప్రయత్నం చేయకపోవడం దురదృష్టకరం. ఎనిమిదేళ్లుగా తెలంగాణకు జరుగుతోన్న అన్యాయం గురించి మీ దృష్టికి తేవడానికి ఈ లేఖ రాస్తున్నాను.
పునర్విభజన చట్టంలో పేర్కొన్న హామీలు:
• లక్షలాది మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉన్న బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై నిర్లక్ష్యం వహించడం… ఏర్పాటు సాధ్యం కాదని తేల్చేయడం తెలంగాణ యువతకు నిరాశను మిగిల్చింది.
• కాజీపేట ప్రాంతంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు దశాబ్దాల కల. ఈ మేరకు విభజన చట్టం షెడ్యూల్ 13లో, 10వ అంశంగా పేర్కొన్నారు. ఈ హామీ అటకెక్కించారు.
• తెలంగాణలో 12 శాతం గిరిజనులు ఉన్నారు. వారి కోసం ప్రత్యేకంగా గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు చట్టం హామీ ఇచ్చింది. ఇప్పటికీ ఏర్పాటుకు చొరవ లేదు.
• పునర్విభజన చట్టంలోని 9, 10 షెడ్యూళ్లలో చేర్చిన సంస్థలు, ఆస్తులు విభజన కొలిక్కి రాలేదు.
• రామగుండంలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 4000 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు హామీ ఇంకా పరిపూర్ణం కాలేదు. పారిశ్రామికాభివృద్ధి కోసం ప్రత్యేక ఇన్సెంటివ్ లు ఇస్తామన్న హామీని నెరవేర్చలేదు
• తెలంగాణకు దక్కాల్సిన ఐఐటీ, ఐఐఎం, వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఐఐఐటీ వంటి ఒక్క ఉన్నత విద్యా సంస్థ కూడా మంజూరు కాలేదు.
ఇతర హామీలు:
• హైదరాబాద్ ఐటీ పరిశ్రమను శిఖర స్థాయికి చేర్చే ఉద్దేశంతో గత ప్రభుత్వం ప్రకటించిన ITIR (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇన్వెస్టిమెంట్ రీజియన్) ప్రాజెక్టును మీ ప్రభుత్వం వచ్చాక రద్దు చేశారు. దీని వల్ల లక్షలాది మంది యువత ఉపాధి దొరికే అవకాశం కోల్పోయారు.
• పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలన్న డిమాండ్ ఉంది. దీనిని కేంద్రం కనీసం పరిగణనలోకి తీసుకోవడం లేదు.
• తెలంగాణకు మణిహారంగా ఉన్న సింగరేణి సంస్థను ప్రైవేటు పరం చేయాలన్న ఆలోచన కార్మిక వర్గాల్లో తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తోంది. సింగరేణి తెలంగాణ సెంటిమెంట్… దానిని ప్రైవేటీకరించాలనుకోవడం నిప్పుతో చెలగాటం ఆడటమే.
• సింగరేణి అనుబంధ సంస్థ అయిన “The Andhra Pradesh heavy machinery and engineering company LTD” (అప్మెల్) విషయంలో సమస్య ఇప్పటికీ పరిష్కారం చేయలేదు.
• దక్షిణ తెలంగాణకు వర ప్రదాయిని కృష్ణా జలాలు. ఈ ఎనిమిదేళ్లలో తెలంగాణ, ఏపీ మధ్య నెలకున్న నీటి వివాదాలను పరిష్కరించే ప్రయత్నం చేయలేదు. కృష్ణా జలాలో మా వాట తేల్చేనే లేదు.
• తెలంగాణ జిల్లాలకు జవహార్ నవోదయ పాఠశాలలు, సైనిక పాఠశాలల ఏర్పాటు విషయంలో మొండి చేయి చూపుతున్నారు.
• తెలంగాణలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. వారి జీవనం అత్యంత దుర్భరంగా ఉంది. ఈ పరిస్థితుల్లో చేనేత పై ఐదు శాతం జీఎస్టీ విధించడం ఏ మాత్రం సమర్థనీయం కాదు. తక్షణం ఆ నిర్ణయాన్ని ఉప సంహరించుకోవాలి.
• రక్షణరంగ పరిశోధనలకు హైదరాబాద్ గుండెకాయ వంటిది. ఇక్కడకు రావాల్సిన డిఫెన్స్ కారిడార్ ను ఉత్తర ప్రదేశ్ కు తరలించుకుపోయారు. కాంగ్రెస్ హాయంలో హైదరాబాద్ కు ఫ్యాబ్ సిటీని మంజూరు చేసింది. సుమారు 15 లక్షల మంది యువతకు ఇందులో ఉపాధి లభించేది. మీ ప్రభుత్వం కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుండా ఈ ప్రాజెక్టును నీరుగార్చారు.
వ్యవసాయ రంగంలో అన్యాయం:
• నిజామాబాద్ నుండి బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే వారం రోజుల్లో పసుపుబోర్డు తెస్తామని రైతులకు లిఖితపూర్వక హామీ ఇచ్చారు. గెలిచిన తర్వాత మాటమార్చి స్పైసెస్ బోర్డు రీజినల్ సెంటర్ పేరుతో మోసం చేశారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని వంద రోజుల్లో తెరిపిస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం చెరకు రైతులను మోసం చేసింది.
• 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చారు. దానికి భిన్నంగా రైతుల పరిస్థితి తయారైంది. నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో లెక్కల ప్రకారం ఒక్క తెలంగాణలోనే 8000 పై చిలుకు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.
• వ్యవసాయ యాంత్రికీకరణ ను ప్రోత్సహించాల్సింది పోయి ఎరువులు, పురుగు మందులు, టార్పాలిన్లు, డ్రిప్ ఇరిగేషన్ పరికరాలపై 18 శాతం జీఎస్టీ… ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాలపై 12 శాతం జీఎస్టీ విధించి రైతులపై భారం వేశారు.
• ఎరువులపై అగ్రిసెస్ పేరుతో రూ.30 వేల కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకోవడం రైతుల నెత్తిన మోయలేని భారం మోపడమే.
• టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిపై మాటలే తప్ప చర్యలు శూన్యం. కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారిందని మీ సహచర కేంద్ర మంత్రి అమిత్ షా, గజేంద్ర సింగ్ షెకావత్, మీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఆరోపణలు చేశారు. దీనిపై చర్యలు తీసుకున్న దాఖలాలు మాత్రం శూన్యం.
• కోకాపేట, ఖానామెట్ భూముల వేలంలో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రూ.1000 నుండి 1500 కోట్ల మేర నష్టం వాటిల్లింది. దీనిపై పత్రసహితంగా కాంగ్రెస్ పార్టీ సీబీఐకి ఫిర్యాదు చేసినా చర్యలు లేవు.
• హైదరాబాద్ డ్రగ్స్ కు అడ్డగా మారింది. ఈ కేసును కేంద్ర సంస్థలైన సీబీఐ, ఈడీ, నార్కొటిక్ అనాలసిస్ బ్యూరో లాంటి కేంద్ర సంస్థలకు అప్పగించాలని కోరుతున్నా అటు టీఆర్ఎస్ ప్రభుత్వం, ఇటు మీ ప్రభుత్వం సిద్ధంగా లేవు.
• అటవీ హక్కుల చట్టం -2006 ను తెలంగాణ ప్రభుత్వం యథేశ్చగా ఉల్లంఘిస్తూ… గిరిజనులు, ఆదివాసీల హక్కులను కాలరాస్తోంది. దీనిపై కేంద్రం ఎందుకు జోక్యం చేసుకోవడం లేదు.
మొత్తంగా తెలంగాణ పట్ల అడుగడుగునా కేంద్రం నిర్లక్ష్యం వహిస్తోంది. కేసీఆర్ వైఖరికి మీ పార్టీ రాష్ట్ర శాఖలోని కొందరు నేతలు కూడా సహకరించే పరిస్థితి. మీ రెండు పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం అలజడి సృష్టించడం తప్ప… రాష్ట్ర ప్రయోజనాల కోసం చర్యలు తీసుకోవడం లేదన్న భావన తెలంగాణ సమాజంలో ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ పర్యటనకు వస్తోన్న మీరు తక్షణం పైన పేర్కొన్న అంశాలపై ఈ గడ్డ మీదనే కార్యచరణ ప్రకటించండి. లేనిపక్షంలో వచ్చే శీతాకాల సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ ఈ అంశాలపై పార్లమెంట్ వేదికగా పోరాటం చేస్తుంది.
ఎ. రేవంత్ రెడ్డి,
ఎంపీ – మల్కాజ్ గిరి,
టీపీసీసీ అధ్యక్షుడు.

Also Read : తెలంగాణ సమాజానికి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

RELATED ARTICLES

Most Popular

న్యూస్