Thursday, March 12, 2026
HomeTrending Newsఆమె బాబు వదిలిన బాణం: షర్మిలపై రోజా కామెంట్స్

ఆమె బాబు వదిలిన బాణం: షర్మిలపై రోజా కామెంట్స్

వైఎస్ షర్మిల టీడీపీ అధినేత చంద్రబాబు వదిలిన బాణం అని రాష్ట్ర పర్యాటక, క్రీడల శాఖ మంత్రి ఆర్కే రోజా వ్యాఖ్యానించారు.  మొన్నటి వరకు తాను తెలంగాణ బిడ్డనని చెప్పుకున్న షర్మిల ఇప్పుడు కొత్త కొత్త అవతారం ఎత్తారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో పార్టీ పెట్టి ఏమి చేయలేక గాలికొదిలేశారని ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను విచ్ఛిన్నం చేసిన కాంగ్రెస్ పార్టీలో చేరారని విమర్శించారు. వైఎస్సార్ కు నిజమైన వారసుడు సీఎం జగన్ మాత్రమేనని స్పష్టం చేశారు.  కేవలం వైఎస్ ఆస్తుల కోసమే షర్మిల రోడ్డెక్కారని ఆరోపించారు. సోమవారం మండలంలోని ఎలకాటూరులో ఒకే ప్రాంగణంలో రూ. 40 లక్షల వ్యయంతో నిర్మించిన సచివాలయ భవనం, రూ.21.8 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రం, రూ.20.8 లక్షల వ్యయంతో నిర్మించిన వెల్‌నెస్‌ సెంటర్‌లను ఆమె ప్రారంభించారు.  ఈ సందర్భంగా నిన్న నగరి నియోజకవర్గంలో పర్యటించిన షర్మిల తనపై చేసిన విమర్శలపై రోజా  ధీటుగా స్పందించారు.

వైఎస్సార్ ఆశయ సాధనకోసం జగన్ కృషి చేస్తుంటే, ఆయన ఆత్మ క్షోభించేలా షర్మిల వ్యవహారం ఉందన్నారు.  గతంలో టీడీపీ ప్రభుత్వం అభివృద్ధిని కాగితాలకే పరిమితం చేసిందని, నేడు ఇంతటి అభివృద్ధి జరుగుతున్నా ప్రతిపక్షాలు విమర్శలు చేయడం చూస్తుంటే వారికేదో కొత్తరోగం వచ్చినట్లుందన్నారు. రంగులు కనిపించని వ్యాధి కంటికి వచ్చేలా అభివృద్ధి పనులు కనిపించని వ్యాధి ప్రతిపక్షాలకు వచ్చినట్లుందంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఎక్కడకు వెళ్లి అడిగినా  తాను చేసిన అభివృద్ధిని ప్రజలే తీసుకెళ్లి చూపిస్తారన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular