Thursday, September 19, 2024
Homeసినిమాశంకర్ మార్క్ కనిపించని 'భారతీయుడు 2' 

శంకర్ మార్క్ కనిపించని ‘భారతీయుడు 2’ 

కమలహాసన్ కథానాయకుడిగా చాలా ఏళ్ల క్రితం వచ్చిన ‘భారతీయుడు’ సినిమాను ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేదు. దేశంలో పెరిగిపోతున్న అవినీతి – లంచగొండితనం ప్రజల జీవితాలతో ఎలా ఆడుకుంటున్నాయనేది చూపిస్తూ, అలాంటి చెద పురుగులను ఏరిపారవేయడానికి ఒక భారతీయుడు ఏం చేశాడనేది ఆ సినిమా కథ. ఆ సినిమా వలన సమాజంలో ఎంత మార్పు వచ్చిందనేది పక్కన పెడితే, ప్రేక్షకులను ఆ కాసేపు ఆలోచింపజేసింది .. ప్రభావితం చేసింది.

అలాంటి సినిమాకి సీక్వెల్ గా వచ్చిందే ‘భారతీయుడు 2’.  లైకా నిర్మాణంలో నిన్ననే థియేటర్లకు ఈ సినిమా వచ్చింది. ఇది కూడా అవినీతి – లంచగొండితనం .. నిర్లక్ష్యం అనే అంశాలపైనే సాగింది.  చిన్న చేపల మార్కెట్ లో .. బరువు ఎక్కువ తూగడం కోసం చేపల లోపల సీసం గోళీలు పెట్టి అమ్ముకునే మహిళ దగ్గర నుంచి, మైనింగ్స్ స్థాయిలో జరిగే అవినీతి వరకూ శంకర్ ఈ సినిమాలో చూపించాడు. ఇంటింటి సమస్యను చూపించడానికి ఆయన చేసిన ప్రయత్నం ప్రేక్షకులకు అసహనాన్ని కలిగిస్తుంది. అసలు ఇది శంకర్ సినిమానేనా అనిపిస్తుంది.

ఇక ‘మర్మకళ’కి సంబంధించి కమల్ చేసిన ఫైట్స్ కి కామెడీని జోడించడం శంకర్ చేసిన మరో తప్పు, అలాంటి ఎపిసోడ్స్ ను అలా కొనసాగిస్తూ వెళ్లడం మరో పొరపాటు. సరైన సన్నివేశాలు పడినప్పుడే సంభాషణలు బాగుంటాయి. గుర్తుపెట్టుకునే డైలాగ్ ఒక్కటి కూడా లేదంటే, ఇక అర్థం చేసుకోవచ్చు. ఏ పాత్రను సరిగ్గా డిజైన్ చేయలేదు .. ఏ ట్యూన్ ఆకట్టుకునేలా లేదు. అసలు కమల్ పాత్రనే పెర్ఫెక్ట్ గా కనిపించదు. ఇంతకాలం పాటు భారతీయుడు ఎక్కడ ఉన్నాడంటే ఇతరదేశాల్లో. దేశాభిమానమున్న ఆ పాత్ర ఇతరదేశాలలో ఉండటానికి అంగీకరిస్తుందా? అనేది సామాన్య ప్రేక్షకుడికి వచ్చే డౌటు.  కథ ఎత్తుకోవడంలోనే శంకర్ పొరపాటు చేశాడు. అనవసరమైన కామెడీ .. అతి ఈ సినిమాను దెబ్బకొట్టాయి. అప్పట్లో వచ్చిన ‘భారతీయుడు’కి దరిదాపుల్లో కనిపించే స్థాయి కూడా లేని సీక్వెల్ ఇది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్