Friday, March 29, 2024
HomeTrending Newsఆనందయ్య మందుకు ప్రత్యేక యాప్

ఆనందయ్య మందుకు ప్రత్యేక యాప్

ఆనందయ్య మందుకోసం ఎవరూ రావొద్దని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు విజ్ఞప్తి చేశారు. కృష్ణపట్నంలో గానీ, నెల్లూరులో గానీ నేరుగా ఆయుర్వేద మందు పంపిణీ చేసే అవకాశం లేదని, దయచేసి ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. అవసరమైన వారికి మందును ఆన్ లైన్ ద్వారా పంపిణీ చేస్తామని, దీనికోసం ప్రత్యేకంగా ఒక యాప్ ను తయారు చేస్తామని ప్రకటించారు. ప్రస్తుతం ముడి సరుకులు సమకూర్చుకునే పనిలో ఆనందయ్య ఉన్నారని, పంపిణీ ప్రారంభించడానికి మరో 5 రోజులు పడుతుందని చెప్పారు.

మందు తయారీ, పంపిణీపై సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఆనందయ్య తో కలిసి జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్, జాయింట్ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, ఆర్డివో హుస్సేన్ సాహెబ్, రూరల్ డిఎస్పి హరినాథ్ రెడ్డి తదితరులు ఈ భేటిలో పాల్గొన్నారు.

ఆనందయ్య మందు పంపిణీ సాఫీగా సాగేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని కాకాణి గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు.  ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయడంతో…. మందు తయారీ, పంపిణీలో  ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని, కోవిడ్ నిబంధనలు పాటిస్తామని కాకాని స్పష్టం చేశారు. ఈ ఆయుర్వేద మందును ముందుగా నెల్లూరు జిల్లాలో, ఆ తర్వాత  రాష్ట్రంలోని ఇతర జిల్లాల వారికి, మూడో విడతలో ఇతర రాష్ట్రాల వారికి పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

ఆయుర్వేద మందు వ్యక్తిగతంగా కోరుకునే వారికి పోస్టు ద్వారా, కొరియర్ సర్వీస్ ద్వారా, ఆన్లైన్ ఆర్డర్ ద్వారా అందించడంతో పాటు, ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేసి, కాల్ సెంటర్ కి ఫోన్ చేసిన వారికీ కూడా నేరుగా అందించే ఏర్పాటు చేస్తామని కాకాణి వివరించారు.

తన ఆయుర్వేద మందుపై అధ్యయనం జరిపించి ఇంత తొందరగా అనుమతులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆనందయ్య ధన్యవాదాలు తెలియజేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్