Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

రాష్ట్రంలో తెలుగుదేశం, వైఎస్సార్సీపీలు రాష్ట్ర అభివృద్ధిని విస్మరిస్తున్నాయని… పోలవరం, రాజధాని అంశాల్లో ఈ రెండు పార్టీలు  ప్రజలను మోసం  చేశాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. బాబు హయాంలో మోడీ ప్రభుత్వం పది లక్షల టిడ్కో  ఇళ్లు రాష్ట్రానికి కేటాయించి ఒక్కో ఇంటికి లక్షా యాభై వేల రూపాయలు సబ్సిడీ ఇచ్చారని, గతంలో మంత్రిగా ఉన్న వెంకయ్యనాయుడు హడ్కో నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రుణాలు కూడా ఇప్పించారని, అప్పుడు వారు, ఇప్పుడు వీరు ఆ ఇళ్ళను పూర్తి చేసి లబ్ధి దారులకు ఇవ్వలేక పోయారన్నారు.  151సీట్లతో అధికారం ఇస్తే కనీసం ఐదు వందల కోట్లతో రోడ్లు వేసే పరిస్థితిలో జగన్ ప్రభుత్వం లేదని విమర్శించారు.  మోడీ ఓ వైపున ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందన్నారు.

ప్రజాపోరు యాత్రలో భాగంగా నెల్లూరులో జరిగిన సభలో సోము పాల్గొన్నారు. పెద్ద ఎత్తున బహిరంగ సభలు కాకుండా ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకొని వీధి సమావేశాలుగా వీటిని నిర్వహిస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి సభలు ఐదు వేలు నిర్వహిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి కేటాయిస్తున్న నిధులు, ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి తెలియజేప్పెందుకే ఈ పోరు యాత్రలు చేస్తున్నామన్నారు.  రాష్ట్రంలో పేద ప్రజలకు బియ్యం అందిస్తుంటే కనీసం మోడీ ఫోటో పెట్టడానికి కూడా భయపడుతున్నారని అన్నారు.  రాష్ట్రంలో అతి తక్కువ ధరకు లిక్కర్ తయారు చేసి అధిక ధరలకు అమ్ముతూ ప్రజలను దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో వనరులు దోచుకుంటున్న ప్రభుత్వాలను తరిమి కొట్టాలని ప్రజలకు సోము విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com