Monday, May 20, 2024
HomeTrending Newsఐటి రంగంలో అద్భుత ప్రగతి : కేటిఆర్

ఐటి రంగంలో అద్భుత ప్రగతి : కేటిఆర్

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పారిశ్రామిక రంగాల్లో తెలంగాణా అద్భుత ప్రగతి సాధించిందని మంత్రి కేటిఆర్ వెల్లడించారు. -2020-21సంవత్సరానికి ఐటి వార్షిక నివేదికను విడుదల చేశారు. పారదర్శకత కోసమే ప్రతి సంవత్సరం వార్షిక నివేదికలు విడుదల చేస్తున్నామన్నారు.

అన్ని రంగాల్లో తెలంగాణా పురోగతి దిశలో వెళుతోందని, ముఖ్యమంత్రి కెసియార్ తీసుకుంటున్న చర్యలు, విధి విధానాలు, సమిష్టి కృషితోనే ఇది సాధ్యమైందన్నారు. జాతీయ వృద్ధిరేటుతో పోల్చితే తెలంగాణా వృద్ధి రేటు రెండింతలు అధికంగా ఉందని పేర్కొన్నారు. 2019-20 సంవత్సరానికి తెలంగాణా రాష్ట్ర ఐటి ఎగుమతులు 1,28,000 వేల కోట్ల రూపాయలు కాగా 2020-21 నాటికి 1,45,626 కోట్ల రూపాయల ఎగుమతులు చేశామని వివరించారు. గత ఏడాది మార్చి నుంచి ఐటి సెక్టార్ లో ఎక్కువ భాగం ‘వర్క్ ఫ్రం హోం’ ద్వారానే నడిచిందని, అయినా కానీ ఎగుమతుల్లో గణనీయమైన పురోగతి కనిపించిందని కేటియార్ చెప్పారు.

కరోనా మహమ్మారి సమయంలో కూడా ఐటి లో 7.99 శాతం కొత్త ఉద్యోగాల కల్పన జరిగిందని, మొత్తం 6,28,615 మంది ఐటి రంగంలో పనిచేస్తున్నారని, 2020-21 లో కొత్తగా 46,489 మంది ఐటి రంగంలో ఉపాధి పొందారని గణాంకాలతో విశ్లేషించారు కేటియార్. ఉపాధి కల్పనలో జాతీయ సగటు 2 శాతం మాత్రమే ఉంటే తెలంగాణాలో 8 శాతం వరకూ ఉందని, ఇది తన సొంత కవిత్వం కాదని, ఎస్ టి పి ఐ, నాస్కామ్ ప్రతినిధులు చెబుతున్న గణాంకాలని చెప్పారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన సమయంలో ఐటి ఎగుమతులు 57వేల కోట్ల రూపాయలు ఉంటే ఈ ఏడేళ్ళలో ఎగుమతులు 1,45,626 కోట్లకు చేరాయన్నారు.

దేశ పౌరుని సగటు తలసరి ఆదాయం 1 ,27 ,768 ఉంటే …తెలంగాణ రాష్ట్ర పౌరుని తలసరి ఆదాయం 2,27,145 గా ఉందన్నారు. కెసియార్ నాయకత్వంలో అన్ని రంగాల్లో సమతుల్యమైన అభివృద్ధి సాధిస్తోందన్న రాష్ట్రంగా తెలంగాణను చెప్పక తప్పదని పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్