తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ తో తెలుగు చలనచిత్ర నిర్మాతలు దిల్ రాజు, దామోదర ప్రసాద్ దగ్గుబాటి సురేష్ సమావేశమయ్యారు. బి ఆర్కే భవన్ లో ఈ భేటి జరిగింది. కరోనాతో నష్టపోయిన నిర్మాతలని, థియేటర్ యజమానులను ఆదుకుంటామని గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపధ్యంలో దానిపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. కోవిడ్ నిబంధనలు సడలించి థియేటర్లు తెరుచుకునేందుకు అనుమతించినా ఇంకా థియేటర్స్ ఎందుకు ప్రారంభించలేదని, సినిమాలు ఎందుకు విడుదల చేయటం లేదని సిఎస్ అడిగి తెలుసుకున్నారు.
ప్రస్తుతం కొత్త సినిమాలు ఏవీ విడుదల కాలేదని, పాత సినిమాలు నడిపిస్తే నష్టాలు వస్తాయని వారు సిఎస్ కు వివరించారు. థియేటర్లు ఓపెన్ చేస్తే సిబ్బందికి జీతాలు, నిర్వహణా ఖర్చులు ఉంటాయని, వాటిని భరించలేమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా థియేటర్స్ ప్రారంభిస్తే తప్ప ఇక్కడ ఓపెన్ చేయడం సాధ్యంకాదని నిర్మాతలు చెప్పారు.
థియేటర్లలో పెయిడ్ పార్కింగ్ వల్లే 40శాతం ఆదాయం ఉంటుందని సిఎస్ కు వివరించిన నిర్మాతలు పెయిడ్ పార్కింగ్ కు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సోమేశ్ కుమార్ నిర్మాతలకు హామీ ఇచ్చారు.