Wednesday, April 17, 2024
HomeTrending NewsGrain: తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తాం - మంత్రి గంగుల

Grain: తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తాం – మంత్రి గంగుల

రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విదంగా కురుస్తున్న అకాల వర్షాలతో ధాన్యం సేకరణ జరుగుతున్న తీరుపై మంత్రి గంగుల కమలాకర్ నేడు సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామన్నారు. వర్షాలతో తడిసిన ధాన్యం కొనుగోలు చేసేందుకు వీలుగా బాయిల్డ్ చేయడానికి జిల్లాలకు ఆదేశాలు జారీ చేసామన్నారు. మొత్తం 1.28 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి అత్యవసర బాయిల్డ్ ఉత్తర్వులు ఇచ్చామని, సేకరణ జరుగుతున్న రీతిలో పెంచుతామన్నారు. వర్షాలతో అత్యధికంగా నష్టపోయిన జిల్లాలైన నల్గొండలో 22వేల మెట్రిక్ టన్నులు, కామారెడ్డి, సిద్దిపేట్, పెద్దపల్లి, సూర్యాపేట కొత్తగూడెంలకు జిల్లాకు 14,706 మెట్రిక్ టన్నులు, నిజమాబాద్లో 14,700, కరీంనగర్లో 7350, యాదాద్రి, జగిత్యాలల్లో 5000వేల మెట్రిక్ టన్నుల చొప్పున బాయిల్డ్ ఆర్డర్ని ఇచ్చామన్నారు మంత్రి గంగుల కమలాకర్.

ఇప్పటివరకూ గత సంవత్సరం యాసంగి కన్నా రెండున్నర రెట్లు అధికంగా ధాన్యం సేకరణ చేసామని, గతేడాది ఇదే రోజున 3.23 LMT’s మాత్రమే కాగా ఈరోజు వరకే 7.51 లక్షల మెట్రిక్ టన్నులను సేకరించామన్నారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ ధాన్యం కొనుగోళ్లు చురుగ్గా చేస్తున్నామన్న మంత్రి రోజుకు 80 వేల మెట్రిక్ టన్నులకు పైగా సేకరిస్తున్నామన్నారు. ఇప్పటివరకూ 5000 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 40 వేల మంది రైతుల నుండి 95 వేల లావాదేవీల ద్వారా 7.51 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించామని, వీటి విలువ 1543 కోట్లని, నిధులకు ఎలాంటి కొరత లేదన్నారు మంత్రి గంగుల కమలాకర్.

ఈ సమీక్షలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ వి.అనిల్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్