Wednesday, July 3, 2024
HomeTrending NewsCaste Census: ఎన్నికలు...కులగణన రాజకీయాలు

Caste Census: ఎన్నికలు…కులగణన రాజకీయాలు

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కులగణన అంశమే ప్రధానం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కుల గణన ప్రధాన అజెండాగా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళుతోంది. ఇందుకు పార్టీ అత్యున్నత నిర్ణాయక కమిటీ…కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధి ఇటీవల అన్ని కార్యక్రమాల్లో కుల గణన ప్రస్తావన తీసుకువస్తున్నారు. మహిళా బిల్లు ఆమోదం రోజు నుంచి దీనిపై చర్చ ఉదృతం చేశారు. మహిళా బిల్లుతో బిజెపి పైచేయి సాధించిందని…దాన్ని ఎదుర్కునేందుకు రాహుల్ కులగణన అంశం తీసుకువచ్చారని బిజెపి ఎదురు దాడి చేసింది. ఇందుకు కొన్ని మీడియా సంస్థలు వంత పాడాయి.

బిహార్ జనాభా లెక్కల విడుదల తర్వాత రాహుల్ కుల గణన అంశాన్ని ప్రతి చోట ప్రస్తావిస్తున్నారు. కేంద్ర కార్యదర్శులలో ఓబీసీలే లేరని ఆ వర్గంలో అర్హులైన వారు లేరా అని ప్రశ్నించటం సాహోసోపెతమనే చెప్పాలి. 90 మంది కేంద్ర కార్యదర్శులలో కేవలం ముగ్గురే ఓబీసీ అధికారులు ఉన్నారనే ప్రస్తావన…దానిపై చర్చను మీడియా, బిజెపి ప్రభుత్వం తేలిగ్గా కొట్టిపారేసినా… ఆయా వర్గాల్లో ఈ అంశం నివురు గప్పిన నిప్పులా రగులుతోంది.

ఓబీసీ వర్గాల నుంచి 85 మంది ఎంపిలు బిజెపి తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారని…తమ పార్టీలో అది 29 శాతమని కమలం నేతలు లెక్కలు చెప్పారు. అయితే కేంద్ర మంత్రివర్గంలో ఎంతమంది మంత్రులుగా ఉన్నారని రాహుల్ ప్రశ్నించటంతో…ప్రధానమంత్రి నరేంద్ర మోడీనే ఎదురు దాడికి దిగారు. దేశాన్ని కులాల వారిగా విడగొట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని విమర్శించారు.

దేశాన్ని ప్రభుత్వాలు నడిపిస్తాయని…కార్యదర్శులు కాదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యంగ్యంగా విమర్శించినా…ఆయన వ్యాఖ్యలపై బలహీన వర్గాల్లో చర్చ జరుగుతోంది.

తాజాగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం తర్వాత జరిగిన మీడియా సమావేశంలో రాహుల్ గాంధి సందించిన ప్రశ్నను మీడియా పట్కుటించుకో పోయినా… ముఖ్యమైనదనే చెప్పాలి. మీడియా సమావేశంలో పాల్గొన్న వారిలో ఎంతమంది ఓబీసీలు ఉన్నారో చేతులు ఎత్తండి అంటే ఎవరు ఎత్తలేదు.

రాహుల్ ప్రశ్నను మీడియా నిర్లక్ష్యం చేసిందా… నిజంగా ఆ సమావేశంలో లేరా..స్పష్టత లేదు. అయితే చట్ట సభల్లో, కేంద్ర, రాష్ట్ర ఉద్యోగాల్లో, మీడియాలో ఏ వర్గం ఎక్కువగా ఉందొ… ఎవరి అనుకూల వార్తలకు ప్రాధాన్యత ఉందొ…ఏ అంశాలపై ఎక్కువగా దృష్టి సారిస్తారో… దేశ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది.

జనాభాలో అన్ని వర్గాల వారికి దామాష పద్దతిలో పదవులు దక్కాలని రాహుల్ డిమాండ్ చేస్తున్నారు. కుల గణన అనేది “భారతదేశం యొక్క ఎక్స్-రే” అని ఇది జనాభా కూర్పును చూపుతుందన్నారు. ఓబీసీ ల గురించి నిత్యం జపం చేసే ప్రధాని కుల గణనను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలంటే ఇంతవరకు సమాధానం రాలేదు.

మొదట మహిళా బిల్లును కౌంటర్ చేసేందుకు కాంగ్రెస్ కులగణన అంశం ఎత్తుకుందని మీడియాలో ఓ వర్గం ప్రచారం చేసింది. రాహుల్ వైఖరి చూస్తుంటే రాబోయే సార్వత్రిక ఎన్నికల వరకు ఇదే ప్రధాన అజెండాగా చర్చకు పెట్టె అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే జనాభా గణన కులాల వారిగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.

కుల గణన కోసం రాజస్తాన్ మంత్రివర్గం ఇప్పటికే ఆమోదం తెలిపింది. ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలలో ఎవరికీ మేలు చేస్తుందో వేచి చూడాలి. రాబోయే ఎన్నికల్లో గట్టేక్కేందుకు కాంగ్రెస్ అందుకుంది అనుకున్నా… వచ్చే ఏడాది లోకసభ ఎన్నికల నాటికి ఖచ్చితంగా ఈ అంశం ఓటర్లను ప్రభావితం చేయనుంది.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్