ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సోమవారం ఢిల్లీలోని ప్రగతి మైదాన్ కన్వెన్షన్ సెంటర్లో కేంద్రమంత్రి మండలి సమావేశం జరుగబోతున్నది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నట్లుగా తెలుస్తున్నది. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరుగనున్నది అనే ప్రచారం జరుగుతున్నది. ఈ క్రమంలో అందరి దృష్టి కేబినెట్ సమావేశాలపైనే ఉన్నది.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20 నుంచి ప్రారంభంకానున్నాయి. సమావేశాల్లో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలనే అంశంపై భేటీలో చర్చించనున్నారు. మరో వైపు మంత్రిమండలిలో మార్పులు చేయాలని భావిస్తే వర్షాకాల సమావేశాలకు ముందే దాన్ని అమలు చేయాలనే వాదనలున్నాయి. జూన్ చివరివారంలో ప్రధాని నరేంద్ర మోదీ.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో విడివిడిగా సమావేశమయ్యారు. అప్పటి నుంచి కేబినెట్ విస్తరణపై వార్తలు గుప్పుమంటున్నాయి.
ఈ ఏడాది తెలంగాణ, ఛత్తీస్గఢ్, మిజోరాం, త్రిపుర, రాజస్థాన్, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాలకు కేబినెట్లో పెద్దపీట వేయాలని బీజేపీ అగ్రనాయకత్వం సైతం భావిస్తున్నట్లు సమాచారం. గతంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా జయకేతనం ఎగుర వేసిన బీజేపీకి దక్షిణాది రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రమైన కర్నాటక కాంగ్రెస్ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఈ ఫలితం బీజేపీ అగ్రనాయకత్వాన్ని షాక్కు గురి చేస్తున్నది. దిద్దుబాటు చర్యలో భాగంగానే రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేంద్రమంత్రి మండలిలో ఆయా రాష్ట్రాలకు పెద్దపీట వేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తున్నది.