Tuesday, March 10, 2026
HomeTrending NewsNuh: నూహ్‌లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు

Nuh: నూహ్‌లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు

ఇటీవల అల్లర్లు చెలరేగిన హర్యానాలోని నూహ్‌లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ రోజు (సోమవారం) అక్కడ శోభాయాత్ర చేపట్టేందుకు విశ్వ హిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ), భజరంగ్‌ దళ్ సన్నద్ధమయ్యాయి. అయితే పోలీసులు అనుమతి నిరాకరించారు. సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ కూడా యాత్ర చేపట్టవద్దని ఆ రెండు సంస్థలకు సూచించారు. స్థానిక ఆలయాల్లో పూజలు నిర్వహించుకోవాలని ప్రజలను కోరారు.

నూహ్‌లో ఈ రోజు (సోమవారం) తలపెట్టిన శోభాయాత్రపై వెనక్కి తగ్గబోమని వీహెచ్‌పీ తెలిపింది. ఎట్టిపరిస్థితుల్లోనూ దీనిని నిర్వహిస్తామని వీహెచ్‌పీ నేతలు తెగేసి చెప్పారు. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. నూహ్‌ జిల్లాలో భద్రతను కట్టుదిట్టం చేశారు. సుమారు రెండు వేల మంది పోలీసులు, 24 కంపెనీల పారామిలిటరీ సిబ్బందిని మోహరించారు. మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. ప్రజలు గుమిగూడటాన్ని నిషేధిస్తూ 144 సెక్షన్‌ను విధించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా భద్రతా చర్యలు చేపట్టారు.

జూలై 31 నూహ్‌ జిల్లాలో వీహెచ్‌పీ చేపట్టిన యాత్రపై దాడి జరిగింది. ఈ సందర్భంగా చెలరేగిన హింస, అల్లర్లలో ఇద్దరు హోంగార్డులతో సహా ఆరుగురు మరణించగా పలువురు గాయపడ్డారు. పలు ఇండ్లు, వాహనాలకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. ఈ అల్లర్లు గురుగ్రామ్‌ వరకు వ్యాపించాయి.

ఈ అల్లర్ల కారణంగా ఆగిపోయిన యాత్రను అక్కడి నుంచి సోమవారం తిరిగి కొనసాగించాలని వీహెచ్‌పీ, భజరంగ్‌ దళ్‌ నిర్ణయించాయి. పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ యాత్రను చేపడతామని స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో నూహ్‌లో మరోసారి టెన్షన్‌ వాతావరణం నెలకొన్నది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular