Friday, March 29, 2024
HomeTrending Newsతెలంగాణలో జూట్ మిల్లులు

తెలంగాణలో జూట్ మిల్లులు

ఇప్పటిదాకా రాష్ట్రంలో జూట్ మిల్లు పరిశ్రమ లేదు.. ఇక్కడ మూడు పరిశ్రమలు ఉత్పత్తి చేసే జ్యూట్ ఉత్పత్తులను తెలంగాణ అవసరాల కోసం కొనుగోలు చేస్తామని పరిశ్రమల శాఖ మంత్రి కే. తారక రామారావు వెల్లడించారు. హైదరాబాద్ లో ఈ రోజు సోమాజిగూడలో జరిగిన జూట్ మిల్లుల ఏర్పాటు ఎంఓయూ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, నిరంజన్ రెడ్డిలతో కలిసి మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు.  తెలంగాణలో జ్యూట్ పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు వచ్చిన మూడు కంపెనీలు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్న మూడు కంపెనీలు, గ్లోస్టర్ లిమిటెడ్, కాళేశ్వరం అగ్రో లిమిటెడ్, ఎంబిజి కమాడిటిస్ లిమిటెడ్. మూడు కంపెనీలు 887 కోట్ల రూపాయలతో 10,400 ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉన్నది. గ్లోస్తెర్ -330,  కాళేశ్వరం అగ్రో లిమిటెడ్ -254, ఎంబిజి కమాడిటిస్ లిమిటెడ్-303 కోట్లు పెట్టుబడిగా పెట్టనున్నాయని మంత్రి తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భారీగా వ్యవసాయ ఉత్పత్తులు,వాటి ప్రోక్యూర్మెంట్ పెరిగిందని, రాష్ట్రంలో ఉన్న గోదావరి కృష్ణ వంటి నీటి వనరులతో పాటు స్థానికంగా ఉన్న చెరువుల అభివృద్ధి ద్వారా వ్యవసాయ రంగంలో భారీ మార్పులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నామని మంత్రి కేటిఆర్ చెప్పారు.

రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు చూడాల్సిన అవసరం ఉన్నదని,అప్పుడే మన రైతాంగానికి వ్యవసాయం లాభసాటిగా ఉంటుందని మంత్రి అన్నారు. ఈరోజు ఏర్పాటు చేస్తున్న ఈ జ్యూట్ మిల్లుల పరిశ్రమలకు అవసరమైన జనప నార పంట పండించడం ద్వారా రైతులకు లాభాలు వచ్చే అవకాశం ఉన్నదని, ఈ పరిశ్రమ ఏర్పాటుతో రాష్ట్రానికి పెట్టుబడులు ఉద్యోగాలతో పాటు రైతులకు మరింత లాభం కలిగే అవకాశం ఉందన్నారు. వరంగల్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాలో ఈ మూడు పరిశ్రమలు రాబోతున్నాయి. అయితే మరిన్ని జిల్లాల్లో పరిశ్రమలు పెట్టేందుకు అవకాశం ఉన్నదని మంత్రి చెప్పారు.

జుట్ ఉత్పత్తులను ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా వాడేందుకు అవకాశం ఉంది.  పర్యావరణ హితంగా మన జీవన విధానాన్ని మార్చుకునేందుకు ఈ ఉత్పత్తులు ఉపయుక్తంగా ఉంటాయని, తెలంగాణ ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో జ్యూట్ ఉత్పత్తులకు భారీ డిమాండ్ ఉండే అవకాశం ఉన్నదన్నారు.

మంత్రి నిరంజన్ రెడ్డి…

తెలంగాణలో పెరుగుతున్న వ్యవసాయ ఉత్పత్తులకు అనుగుణంగా అవసరమైన జ్యూట్ మిల్లుల ఏర్పాటు పై  సీఎం కెసిఆర్ ప్రత్యేక దృషి సారించారని,  ఈ రోజు కంపెనీలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన సంస్థలకు అవసరం అయిన జనపనార పంటలు పండించేలా రైతులను ప్రోత్సహిస్తామని వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ తరఫున ప్రత్యేక కార్యక్రమాలను  చేపడతామన్నారు.

మంత్రి గంగుల కమలాకర్…..

జూట్ మిల్లుల వల్ల దాదాపు 11 వేల తెలంగాణ నిరుధ్యోగ యువతకు పెద్ద ఎత్తున ప్రత్యక్షంగా ఉపాది, వేలాది కుటుంబాలకు, రైతులకు పరోక్షంగా లబ్దీ చేకూరుతుందన్నారు. తెలంగాణలో గన్నీ బ్యాగుల అవసరం గత ఏడేళ్లుగా 2014లో 24 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కోసం 3.2కోట్ల కొత్త గన్నీ బ్యాగుల అవసరం నుండి  2021-22లో 141 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కోసం  50 కోట్ల  గన్నీల వరకూ  పెరుగుతూ వస్తుందన్నారు.

కరోనా సంక్షోభంలో కేంద్ర గన్నీ కార్పోరేషన్ డబ్బులు కట్టినప్పటికీ మనకు సరిపడా గన్నీ బ్యాగులు అందించలేకపోయిందని సివిల్ సప్లైస్ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.  FCI గైడ్ లైన్స్ ప్రకారం 54 శాతం కొత్త గన్నీలు వాడాల్సిన అవసరం ఉందని ఇందులో సింహాబాగం వెస్ట్ బెంగాల్, ఛత్తీస్గడ్, ఏపీల నుండే 49.26 నుండి 61.78 రూపాయలతో ఒక్కో గన్నీ బ్యాగుని  సేకరిస్తున్నామని, ట్రాన్స్ పోర్ట్ కోసం 2.36 నుండి 67పైసల వరకూ ఖర్చు చేస్తున్నామని,  కొత్త జూట్ మిల్లుల   ద్వారా సమయంతో పాటు నిధులు  ఖర్చు సైతం తగ్గుతుందన్నారు. ఇవి ఉత్పత్తి చేసే 5కోట్ల గన్నీ బ్యాగులు మనకే కేటాయించాలని కోరారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్