Monday, March 16, 2026
HomeTrending Newsఈడీ దాడులు.. ఐటీ శాఖలో భారీ బదిలీలు

ఈడీ దాడులు.. ఐటీ శాఖలో భారీ బదిలీలు

ఐటీ శాఖలో కేంద్ర ప్రభుత్వం భారీగా బదిలీలు చేపట్టింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పూర్తిగా ప్రక్షాళన చేపట్టింది. హైదరాబాద్‌ ఇన్‌కమ్ ట్యాక్ ఇన్వెస్టిగేషన్ వింగ్ డీజీగా ఉన్న వసుంధర సిన్హాను ట్రాన్స్‌ఫర్ చేసిన కేంద్రం.. ఆమె స్థానంలో ప్రస్తుతం ముంబైలో ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంజయ్ బహదూర్‌ని నియమించింది. డీజీగా ఉన్న వసుంధర సిన్హాను ఏడాదిలోనే బదిలీ చేయడం సంచలనంగా మారగా.. తాజాగా ఐటీ శాఖలో 83 మంది చీఫ్ కమిషనర్ స్థాయి అధికారుల బదిలీ చేసింది. ఐటీ శాఖ చరిత్రలో ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో బదిలీలు జరగడం ఇదే తొలిసారని అంటున్నారు. 155  మంది ప్రిన్సిపల్ కమీషనర్ స్థాయి అధికారుల బదిలి అయ్యారు. హైదరాబాద్ ఐటీ చీఫ్ గా శిశిర్ అగర్వాల్ .. విజయవాడ ఐటీ చీఫ్ గా శ్రీపాద రాధాకృష్ణ నియమితులయ్యారు.

కొంత కాలంగా తెలంగాణలో కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు నిర్వహిస్తున్నాయి. ఢిల్లి లిక్కర్ స్కామ్ లో సీబీఐతో పాటు ఈడీ దాడులు జరుగుతున్నాయి. ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. గత నెలలో ఫీనిక్స్ గ్రూప్ పై దాడులు జరిగాయి. వాసవి గ్రూప్ కార్యాలయాల్లోనూ ఐటీ అధికారులు సోదాలు జరిపారు. ఇవన్ని సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల టార్గెట్ గానే జరిగాయనే టాక్ వస్తోంది. రెండు నెలల క్రితమే హైదరాబాద్ ఈడీ అధికారిని మార్చింది కేంద్రం. దినేష్ పరుచూరికి బాధ్యతలు అప్పగించింది. ఆ తర్వాతే ఈడీ దాడులు పెరిగాయి. తాజాగా ఐటీ శాఖలో బదిలీలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారాయి.

సెప్టెంబర్ 17న జరిగిన తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు హైదరాబాద్ వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేషనల్ పోలీస్ అకాడమిలో బస చేశారు. ఈ సందర్భంగా అక్కడే ఇన్‌కమ్ టాక్స్ అధికారులతో సమీక్ష చేశారనే వార్తలు వచ్చాయి. ఇంతలోనే ఐటీ శాఖలో బదిలీలు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.  ఇక్కడ విధుల్లో ఉన్న అధికారులు.. టీఆర్ఎస్ నేతల విషయంలో మెతక వైఖరితో ఉన్నారని గ్రహించడం వల్లే బదిలీ చేశారనే ప్రచారం సాగుతోంది. ఇప్పటివరకు ఇన్‌కమ్ ట్యాక్ ఇన్వెస్టిగేషన్ వింగ్ డీజీగా ఉన్న వసుంధర సిన్హా.. తెలంగాణ ఏసీబీ చీఫ్ అంజనీకుమార్ సతీమణి. అంజనీకుమార్ కు కేసీఆర్ ప్రభుత్వం మంచి ప్రాధాన్యత ఇచ్చింది. ఆయన హైదరాబాద్ కమిషనర్ గా సుదీర్ఘ కాలం పని చేశారు. తర్వాత ఆయనకు కీలకమైన ఏసీబీ బాధ్యతలు అప్పగించింది. ఈ కారణంగానే వసుందర సిన్హాకు తప్పించారని అంటున్నారు.

Also Read: హైదరాబాద్‌లో మరోసారి ఈడీ సోదాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular