Friday, June 12, 2026
HomeTrending Newsగుణాత్మక అభివృద్ధికి బాటలు: కేసిఆర్ ఆకాంక్ష

గుణాత్మక అభివృద్ధికి బాటలు: కేసిఆర్ ఆకాంక్ష

తెలంగాణ వ్యవసాయ రంగంలో చోటుచేసుకున్న విప్లవాత్మక ప్రగతి అందించే స్ఫూర్తితో, యావత్ దేశ రైతాంగానికి వ్యవసాయం పండుగైన నాడే.. భారత దేశానికి సంపూర్ణ క్రాంతి చేకూరుతుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు.

భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగలను పురస్కరించుకొని సీఎం కేసీఆర్ దేశ, రాష్ట్ర రైతాంగానికి, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పంట పొలాల నుంచి ధాన్యపు రాశులు ఇండ్లకు చేరుకున్న శుభ సందర్భంలో రైతన్న జరుపుకునే సంబురమే సంక్రాంతి పండుగని, నమ్ముకున్న భూతల్లికి రైతు కృతజ్ఞతలు తెలుపుకునే రోజే సంక్రాంతి పండుగ అని అన్నారు.

నేడు తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయరంగాన్ని పునురుజ్జీవింప చేసేందుకు చేపట్టిన కార్యాచరణతో తెలంగాణ పల్లెలు పచ్చని పంట పొలాలు, ధాన్యరాశులు, పాడి పశువులు, కమ్మని మట్టివాసనలతో సంక్రాంతి శోభను సంతరించుకుని వైభవోపేతంగా వెలుగొందుతున్నాయని సీఎం పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయరంగం సాధించిన ప్రగతి నేడు యావత్ దేశానికి మార్గదర్శనంగా నిలిచిందని సీఎం అన్నారు. రాష్ట్ర వ్యవసాయరంగాన్ని బలోపేతం చేసే దిశగా లక్షలాది కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అని సీఎం ఆన్నారు. తెలంగాణ అమలుచేస్తున్న రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ఇప్పటివరకు రూ. 2,16,000 కోట్లకు పైగా ప్రభుత్వం ఖర్చు చేసిందనీ  వివరించారు.

రైతుల సంక్షేమం పట్ల తెలంగాణ ప్రభుత్వానికున్న నిబద్ధతకు ఇది తార్కాణం అని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విప్లవాత్మక రైతు సంక్షేమ వ్యవసాయరంగ అభివృద్ది కార్యాచరణతో నాడు రాష్ట్ర ఆవిర్భావం నాటికి 1 కోటి 31 లక్షల ఎకరాలు మాత్రమే వున్న సాగు విస్తీర్ణం,నేడు 2 కోట్ల 4 లక్షల ఎకరాలకు పెరిగిందన్నారు.

ఇది దేశ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక పరిణామని సీఎం తెలిపారు. ఒకనాడు దండుగ అన్న వ్యవసాయం తెలంగాణ లో నేడు పండుగ అయిందని, వ్యవసాయరంగాన్ని నమ్ముకుంటే జీవితానికి ఢోకా లేదనే విశ్వాసం తెలంగాణ రైతుల జీవితాల్లో తొణికిసలాడుతున్నదని, ఇదే విశ్వాసాన్ని దేశ రైతాంగం లో పాదు కొల్పుతామని సీఎం స్పష్టం చేశారు.

ఈ దిశగా యావత్ భారత ప్రజల సహకారంతో, సమిష్టి కృషితో దేశ వ్యవసాయ రంగ నమూనా ను సమూలంగా మార్చి గుణాత్మక అభివృద్ది కి బాటలు వేయాల్సిన అవసరం వుందన్నారు. ప్రజలంతా మకర సంక్రాంతి పండుగను సుఖసంతోషాలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలనీ, ప్రతీ ఇల్లు సిరిసంపదలతో తులతూగాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular