Saturday, July 27, 2024
Homeతెలంగాణకఠినంగా లాక్ డౌన్ అమలు : డిజిపి

కఠినంగా లాక్ డౌన్ అమలు : డిజిపి

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేయాలని డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి పోలీస్ అధికారులను ఆదేశించారు. రేపటి నుండి పది రోజులపాటు రాష్ట్రంలో లాక్ డౌన్ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయించడంతో దీని అమలుపై నేడు రాష్ట్రం లోని రేంజ్ ఐజీలు, డీఐజీ లు, పోలీస్ కమీషనర్లు, ఎస్.పీ లతో వీడియో కాన్ఫరెన్స్ డీజీపీ నిర్వహించారు. శాంతి, భద్రతల విభాగం అడిషనల్ డీజీ జితేందర్ పాల్గొన్న ఈ వీడియో కాన్ఫరెన్స్ లో మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, పోలీస్ కమీషనర్లు, ఎస్.పీ లనుండి డీ.ఐ.జీ స్థాయి సీనియర్ పోలీస్ అధికారులందరూ విధిగా క్షేత్ర స్థాయిలో ఉండి లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేసేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

లాక్ డౌన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుండి విడుదలయ్యే ఉత్తర్వులను కచ్చితంగా పాటించాలని అన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ తోపాటు అన్ని ప్రధాన నగరాలు, జిల్లా హెడ్ క్వార్టర్లు, ప్రధాన నగరాలలో పటిష్టంగా అమలు చేయాలని కోరారు. రాష్ట్రం లో వ్యవసాయ సంబంధిత కార్యకలాపాలు, ధాన్యం సేకరణ, రవాణా లపై ఏవిధమైన ఆంక్షలు లేవని తెలిపారు. జాతీయ రహదారులపై రవాణా పై ఏవిధమైన ఆంక్షలు లేవని అన్నారు. ప్రధాన రంగంలో ఉన్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు తమ అక్రిడేషన్లు కానీ, పత్రికా పరమైన గుర్తింపు కార్డులు తమవెంట ఉంచుకోవాలని స్పష్టం చేశారు.
గ్రామాల్లో వ్యవసాయ సంబంధిత పనులు, ఉపాధిహామీ పనులను లాక్ డౌన్ నుండి మినహాయించారని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు వారి శాఖా పరమైన గుర్తింపు కార్డులుంటే సరిపోతుందని తెలిపారు. రాష్ట్రం లో జరిగే వివాహాలకు ఇరువైపుల చెందిన 40 మంది మాత్రమే హాజరయ్యేవిధంగా చూడాలని అన్నారు. వివాహలకు తప్పనిసరిగా ముందస్తు అనుమతులు పొందాలని అన్నారు. అదేవిధంగా, మరణాలకు సంబంధించి కేవలం 20 మంది మాత్రమే హాజరు కావాలని తెలియచేసారు.

కరోనా వాక్సినేషన్ కు ఎవరైనా వెళ్లాల్సివస్తే వారి మొదటి డోస్ కు సంబందించిన సమాచారం సెల్ ఫోన్ లో చూసి వారికి సడలింపు ఇవ్వాలని తెలిపారు. నిత్యావసర వస్తువుల రవాణా సక్రమంగా జరిగేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. నిత్యావసర వస్తువుల రవాణా, ఇతర ఎమర్జెన్సీ సేవలకు సంబంధించి స్థానికంగా సమయాలను పేర్కొంటూ ప్రత్యేక పాసులను జారీ చేయాలని అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై డిజాస్టర్ మేనేజిమెంట్ చట్టం తో పాటు ఐ.పీ.సి ప్రకారం తగు కేసులు నమోదు చేయాలని మహేందర్ రెడ్డి పోలీస్ అధికారులకు స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణం చేసే వారికి ఈ- పాస్ విధానం ద్వారా సంబంధిత కమిషనర్లు, ఎస్పీలు పాసులను జారీ చేస్తారని స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్