Saturday, April 20, 2024
Homeసినిమాఅందరం కలిసి మెలిసి ఉందాం : మోహన్ బాబు

అందరం కలిసి మెలిసి ఉందాం : మోహన్ బాబు

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు, ఆయన ప్యానెల్ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం ఈరోజు (16.10.21) జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. పద్మశ్రీ డా. మోహన్ బాబు, ఆదిశేషగిరిరావు, కాజా సూర్యనారాయణ, చదలవాడ శ్రీనివాసరావు, నరేష్, సి. కళ్యాణ్, శివక‌ృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ ‘‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణుకి కంగ్రాట్స్. విష్ణు యువకుడు. ఉత్సాహవంతమైన వాడు. ఆయన గెలుస్తాడు అని పది రోజుల ముందే చెప్పాను. ఎన్టీఆర్ గారు, నాగేశ్వరరావు గారు, ఆ తర్వాత శోభన్ బాబు, కృష్ణంరాజు, తర్వాత పెద్దలు మోహన్ బాబు, ఆ తర్వాత చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, తర్వాత తరంలో పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఎంతో మంది ప్రముఖ నటులు చలనచిత్ర పరిశ్రమకు రావడం జరిగింది. మోహన్ బాబు గారికి కోపం, ఆవేశం ఎక్కువ. అయితే ఆయన కోపం ఆయనకే చేటు చేసింది కానీ, ఎవ్వరికీ చెడు చేయలేదు.  తప్పును తప్పుగా చెప్పే వ్యక్తి. ధైర్యంగా తప్పును ప్రశ్నిస్తారు. అది ఆవేశం, కోపం అని వేరే వాళ్లు అనుకుంటారు. మనం చేయలేని పని తను చేసినప్పుడు, సమాజ హితం కోసం మాట్లాడుతున్నప్పుడు వ్యక్తిగత అంశాలు ఉండవు. మోహన్ బాబు గారు తన కొడుకు విష్ణుకు మంచి చదువు, సంస్కారం, క్రమశిక్షణను ఇచ్చారు. పెద్దలను గౌరవిస్తూనే మాట్లాడతారు. మా అసోసియేషన్ చిన్న వ్యవస్థ కాదు. 912 మంది ఫ్యామిలీలు ఉన్నాయంటే అది పెద్ద వ్యవస్థ. అలాంటి ‘మా’ అసోసియేషన్ కోసం ప్రభుత్వం నుంచి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తాము” అన్నారు.

పద్మశ్రీ డా. మోహన్ బాబు మాట్లాడుతూ “ఇది రాజకీయ వేదిక కాదు. ఇది కళాకారుల వేదిక. రాజకీయాలు ఇక్కడ ఉండకూడదు. కొందరు రాజకీయాల్లో ఉండొచ్చు.. కానీ ‘మా’లో మాత్రం రాజకీయాలు ఉండొద్దు. కళాకారులంతా ఒకే తల్లి బిడ్డలు. నేను ముందు నుంచి కూడా ఇదే చెబుతున్నాను. అందరం ఒకే బిడ్డలం. సీనియర్లను గౌరవించుకోవడం కూడా ఇప్పుడు మరిచిపోతున్నాం. ఎంతో మంది గొప్ప వాళ్లంతా కలిసి ‘మా’ ను నడిపించారు. సినిమాలున్నాయా? లేదా? అని ముఖ్యం కాదు. సినిమాలు హిట్ అవుతాయి.. ఫ్లాప్ అవుతాయి. అది కాదు ముఖ్యం. ఎంత కష్టపడినా ఒక్కోసారి సక్సెస్ అనేది ఉండదు. మేం ఇంత మంది ఉన్నాం.. అంత మంది ఉన్నామని బెదిరించారు కానీ మా సభ్యులు ఎవ్వరూ కూడా ఇక్కడ భయపడలేదు. ఒకరి దయాదక్షిణ్యాలతో అవకాశాలు రావు. టాలెంట్, క్రమశిక్షణ ఉంటే ఛాన్సులు వస్తాయి. మా ఓటు మా సొంతమని నా బిడ్డను గెలిపించారు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోవాలి. పానెల్ సభ్యులు భార్యబిడ్డలను వదిలి ఎన్నికల్లో పని చేశారు”

“నాకు రాగద్వేషాలు ఉండవు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడేవాడిని. ఇంత మంది మంచి మనుషులు నా బిడ్డను ఆశీర్వదించారు. మీరే మా దేవుళ్లు. ఓటు వేయని వాళ్ల మీద పగను పెంచుకోవద్దు. అవతలి వాళ్లకు కూడా నేను అవకాశాలు ఇస్తాను. భారతదేశం గర్వించదగ్గ ఖ్యాతిని ‘మా’కు తీసుకురావాలి. సభ్యత, సంస్కారంగా కేసీఆర్‌ను కలవాలి. ఈ ప్రమాణ స్వీకారం తరువాత కేసీఆర్‌ను కలుస్తాం. హీరోలు ఎన్నికలకు రాకపోయినా, ఓటింగ్ వేయకపోయినా ఈ అసోసియేషన్ అందరిది. మీ సహకారం కావాలి. కలిసి మెలిసి పని చేసుకుందాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నేర్చుకుంటుంది. ఇది చిన్న ఉద్యోగమని కొందరు అంటారు. మీకు తెలియదా? ఇది చాలా పెద్ద బాధ్యత. అందరూ కలిసి మెలిసి పని చేసుకోండి. సభ్యుల్లో ఎవరికైనా సమస్యలు ఉంటే ప్రెసిడెంట్‌కు చెప్పండి. అంతేకానీ టీవీల్లోకి ఎక్కకండి”

“విష్ణు చేతిలో ఇప్పటికే మూడు సినిమాలున్నాయి.. విద్యానికేతన్ కూడా ఉంది. పైగా ‘మా’ బాధ్యత కూడా ఉంది. ఇవన్నీ ఎలా చేస్తాడా? అని భయంగా ఉంది. చిత్రపురి కాలనీని హెరిటేజ్‌గా మార్చేద్దామని సీఎం అనుకుంటే.. దాన్ని అడ్డుకున్నాను. అది మా కళాకారుల కోసమే ఉండాలని నేను మదనపడ్డాను. ఎవరు గుర్తు పెట్టుకున్నా లేకున్నా ఆ ప్రకృతికి తెలుసు. అందరం కలిసి మెలిసి ఉందాం. కలిసికట్టుగా పని చేసుకుందాం. నా బిడ్డ విజయానికి ఎంతో ముఖ్యమైన వాడు నరేష్. రెండు నెలలు తన సినిమాలు పక్కన పెట్టి మరీ విజయం కోసం పని చేశాడు. ఆయన నా మిత్రుడు కూడా కాదు. కానీ అన్నా నేనున్నాను అని వచ్చాడు. కృష్ణమోహన్ పక్షపాతం చూపించకుండా ఎన్నికలను నిర్వహించాడు. ఇక పైన అయినా టీవీలకు వెళ్లకండి. ఎక్కువగా రెచ్చగొట్టకండి. మనం అంతా కూడా ఒక్కటే. అందరూ బాగుండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను” అని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్