Thursday, April 18, 2024
HomeTrending Newsకెసిఆర్ కుటుంబానికే పదవులు-అమిత్ షా

కెసిఆర్ కుటుంబానికే పదవులు-అమిత్ షా

జ్లిస్‌ కు భయపడే వాళ్లను అధికారం నుంచి తొలగించాలని తెలంగాణ ప్రజలను ఉద్దేశించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా పిలుపు ఇచ్చారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును గద్దె దించేందుకు బండి సంజయ్ ఒక్కడు చాలునని.. తాను రావాల్సిన పనిలేదని ఆయన అన్నారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన రెండో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర ముగింపు సందర్భంగా శంషాబాద్ సమీపంలోని తుక్కుగూడలో శనివారం (మే 14) సాయంత్రం బీజేపీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

నేను పదహారేళ్ల ప్రజా జీవితంలో ఉన్నాను.  నాకిప్పుడు 71 ఏళ్లు. నా జీవితంలో ఇంత అవినీతి ప్రభుత్వాన్ని చూడలేదని అమిత్ షా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే యోచనలో ఉన్నారని, దమ్ముంటే రాజీనామా చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని సవాల్ చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. కేసీఆర్‌పై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. తాము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని అమిత్‌షా స్పష్టం చేశారు. అధికారంలోకి రాగానే ప్రతి గింజా కొంటామని తెలిపారు. తన మాటలు వింటుంటే కేసీఆర్‌కు భయం పట్టుకుందని అమిత్‌షా అన్నారు. కేసీఆర్‌ ను తరిమేందుకు ప్రజలు ఉత్సాహంగా ఉన్నారని తెలిపారు. కేసీఆర్‌ చెప్పిన నీళ్లు, నిధులు, నియామకాలు జరిగాయా? అని ప్రశ్నించారు. బీజేపీ గెలిస్తే నీళ్లు, నిధులు, నియామకాలు హామీ నెరవేరుతుందన్నారు.

బండి సంజయ్ పాదయాత్ర ఒకరిని ముఖ్యమంత్రిని చేసేందుకో, మరొకదానికో కాదని.. తెలంగాణ రాష్ట్రంలో దళితులు, ఆదివాసీలు, రైతులు, అణగారిన వర్గాల క్షేమం కోసమేనని అమిత్ షా అన్నారు.‘ మజ్లిస్‌లకు భయపడే వాళ్లను పెకిలించి విసిరేసే యాత్ర ఇది. రజాకార్ల పీడను తొలగించి, తెలంగాణ గడ్డను భారత్‌లో విలీనం చేసిన సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్‌కు శ్రద్ధాంజలి ఘటించే యాత్ర’ అని ఆయన అన్నారు. రామానంద తీర్థ, సురవరం ప్రతాప రెడ్డి, దాశరథి, పీవీ నరసింహా రావుకు కూడా ఈ సందర్భంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నానని అమిత్ షా అన్నారు.

‘హైదరాబాద్ నుంచి నిజాంను తొలగించాలి. నేనేం చెప్తున్నానో మీకు అర్థమవుతోందా? ఈ గడ్డను రజాకార్ల పీడ నుంచి తొలగించి భారత్‌లో విలీనం చేసిన వారికి శ్రద్ధాంజలి అర్పించాలి. టీఆర్‌ఎస్ పార్టీని అధికారం నుంచి పెకిలించేందుకు అందరూ చేతులు కలపాలి. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకోవాలి’ అని అమిత్ షా అన్నారు. నరేంద్ర మోదీ సర్కార్ వచ్చిన తర్వాతే వరి ధాన్యానికి మద్దతు విలువ పెరిగిందని అమిత్ షా అన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని నిందించొద్దని సూచించారు. మజ్లిస్, టీఆర్‌ఎస్ ఇద్దరూ మిత్రులేనని.. టీఆర్‌ఎస్ స్టీరింగ్ ఒవైసీ చేతిలోనే ఉందని వ్యాఖ్యానించారు.

45 డిగ్రీల ఉష్ణోగ్రతలో భగభగలాడే ఎండలోనూ బండి సంజయ్ 660 కి.మీ. దూరం నడిచారని అమిత్ షా కొనియాడారు. ఆయనకు మద్దతివ్వాలని పార్టీ శ్రేణులకు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సభలో ఉన్నవారందరినీ తమ మొబైల్ ఫోన్లను చేతిలోకి తీసుకొని.. 6359119119 నంబర్‌కు మిస్‌డ్ కాల్ ఇచ్చి బండి సంజయ్‌కు మద్దతివ్వాలని కోరారు.

‘కేసీఆర్ వాగ్ధానం చేసిన నీళ్లు – నిధులు – నియామకాలు వచ్చాయా? దళితులకు మూడెకరాల భూమి వచ్చిందా? బీసీలకు ఏటా వెయ్యి కోట్ల బడ్జెట్ ఇవ్వాలి. కేటాయిస్తున్నారా? హైదరాబాద్‌లో 4 సూపర్ స్పెషాటిలీ ఆస్పత్రులు నిర్మిస్తానని వాగ్ధానం చేశారు. అది చేయలేదు సరికదా.. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులను నిర్వీర్యం చేశారు. ఆయన కుమారుడు, కుమార్తెకు మాత్రం అధికారం ఇచ్చారు’ అని అమిత్ షా విమర్శించారు.

తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధుల గురించి లెక్కలు చెప్పిన అమిత్ షా.. కేంద్రం రూ.18 కోట్లు ఇస్తే, హరితహారం పథకాన్ని తమ పథకంగా చెప్పుకుంటున్నారని అన్నారు. వరంగల్‌ సైనిక్‌ స్కూల్‌కు 2016లో అనుమతి ఇచ్చామని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదని షా చెప్పారు. తెలంగాణకు ఎనిమిదేళ్లలో రూ.2.52 లక్షల కోట్లు ఇచ్చామని అమిత్‌షా తెలిపారు. కేసీఆర్‌కు అమిత్‌షా సవాల్ విసిరారు.

Also Read : అమిత్ షాకు ఎమ్మెల్సీ కవిత ప్రశ్నల వర్షం

RELATED ARTICLES

Most Popular

న్యూస్