Tuesday, September 17, 2024
Homeసినిమావైష్ణవ్ తేజ్ నుంచి 'వచ్చాడయ్యో సామీ'

వైష్ణవ్ తేజ్ నుంచి ‘వచ్చాడయ్యో సామీ’

‘ఉప్పెన’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తూనే వైష్ణవ్ తేజ్ భారీ హిట్ కొట్టాడు. మెగా ఫ్యామిలీ నుంచి మరో మంచి కటౌట్ వచ్చిందని అభిమానులు చెప్పుకున్నారు. అయితే ఆ తరువాత కథలను ఎంచుకునే విషయంలో వైష్ణవ్ తడబడ్డాడు. ఫలితంగా వరుస ఫ్లాపులను అందుకోవలసి వచ్చింది. ‘ఆదికేశవ’ సినిమా కూడా అసంతృప్తినే మిగిల్చింది. దాంతో వైష్ణవ్ కాస్త గ్యాప్ తీసుకున్నాడు. కథల ఎంపిక విషయంలో మరింత జాగ్రత్త పడ్డాడు.

ఆ తరువాత ఆయన విన్న కథల్లో ఆయనకి ఒకటి బాగా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ కథను వినిపించిన దర్శకుడు కృష్ణ చైతన్య. రైటర్ గా ఇండస్ట్రీకి పరిచయమైన కృష్ణ చైతన్య, ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాతో దర్శకుడిగా మారాడు. విష్వక్సేన్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా, ఆశించినస్థాయిలో ఆడలేదు. అయినా దర్శకుడిగా అతనిపై ఒక నమ్మకాన్ని మాత్రం కలిగించింది. అందువల్లనే వైష్ణవ్ అంగీకరించాడని అంటున్నారు.

వైష్ణవ్ హీరోగా చేయనున్న ఈ సినిమాకి ‘వచ్చాడయ్యో సామీ’ అనే టైటిల్ ను సెట్ చేసే ఆలోచనలో ఉన్నారని సమాచారం. ‘భరత్ అనే నేను’ సినిమాలో ‘వచ్చాడయ్యో సామీ’ అనే పాట జనంలోకి బాగా వెళ్లింది. అందువల్లనే అందులో నుంచి టైటిల్ తీసుకున్నారు. టైటిల్ పరంగా అయితే మంచి మార్కులు కొట్టేసేలానే ఉంది. ఇక జోనర్ ఏమిటి? .. కంటెంట్ ఏమిటి? అనేది చూడాలి. ఇక ఈ ప్రాజెక్టుకి సంబంధించిన మిగతా వివరాలు త్వరలో తెలియనున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్