Friday, March 29, 2024
HomeTrending NewsYS Jagan: మా బ్రాండ్ అంబాసిడర్లు మీరే: వాలంటీర్లతో సిఎం జగన్

YS Jagan: మా బ్రాండ్ అంబాసిడర్లు మీరే: వాలంటీర్లతో సిఎం జగన్

వాలంటీర్‌ వ్యవస్థ అంటే చంద్రబాబుకు, ఎల్లోమీడియాకు కడుపులో మంట అని, అందుకే నిరంతరం వీరిపై దుష్ప్రచారం, విమర్శలు చేస్తూనే ఉన్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. సూర్యుడు ఉదయించకముందే ఇళ్లకు వెళ్లి పెన్షన్‌ డబ్బులు చేతిలోపెట్టి.. ఆప్యాయతలు చూపించే వాలంటీర్లకు బాబు దురుద్దేశాలు ఆపాదించారని, వారు మద్యం తాగుతారని, మూటలు మోస్తారని, అల్లరి మూకలని వారిని కించపరిచారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో సిఎం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ప్రసంగిస్తూ… కోర్టులకు వెళ్లి ఈ వ్యవస్థను ఆడ్డుకోవాలని చూశారని ఆరోపించారు. వాలంటీర్ల సేవలను ప్రజలు గుర్తించగానే,  మళ్ళీ మాట మార్చి వీరంతా జగన్‌ సైన్యం అంటూ వ్యాఖ్యలు చేశారని అన్నారు.

బాబు హయంలో జన్మభూమి కమిటీలు చేసిన అరాచకాలు, దోపిడీ ప్రజలు ఇంకా మర్చి పోలేదని, కానీ ఆయన మాత్రం మళ్ళీ అధికారంలోకి వస్తే  వాలంటీర్ల వ్యవస్థను రద్దుచేసి  జన్మభూమి కమిటీలతో దోపిడీ సైన్యాన్ని తీసుకు వస్తానంటూ  చెబుతున్నారని సిఎం విమర్శించారు.  మంచి చేస్తున్న ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి బ్రాండ్‌ అంబాసిడర్లే వాలంటీర్లు…. జగనన్న సైన్యం వాలంటీర్లు అని అభివర్ణించారు.

“ఈ ప్రభుత్వ ఫిలాసఫీకి ప్రతిరూపం వాలంటీర్లు, వాలంటీర్లు చేస్తున్నది సేవ… ప్రభుత్వం ఉద్యోగం పరిధిలోకి వచ్చేది కాదు, ఇది స్వచ్చంద సేవ, ఇక్కడ పనిచేస్తున్న ఏ ఒక్కరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులు కారు,  ఇక్కడ పనిచేస్తున్న ప్రతి వాలంటీర్‌కూడా స్వచ్ఛందంగా మంచి చేయాలనే మనస్సు పెట్టి తపన, తాపత్రయంతో అడుగులు వేస్తున్న మంచి మనుషులు.  కాబట్టి.. ఎవరైనా ఇది మీరు చేయాల్సిన పనికాదు  అని అంటే.. గట్టిగా సమాధానం చెప్పాలి” అంటూ వారికి ఉద్భోదించారు.  “వాలంటీర్‌ కార్యక్రమంద్వారా  మీ రాజకీయ హక్కులకు, అభ్యుదయ ఆదర్శ భావాలకు ఎలాంటి ఆటంకాలు, అవరోధాలు ఉండవని చెప్తున్నాను. వాలంటీర్లను ఉద్దేశించి నేను చేసిన మొదటి ప్రసంగాన్ని మీరు గుర్తుకు తెచ్చుకోండి, మిమ్మల్ని లీడర్లుగా చేస్తానని చెప్పాను. ఆ మాటను గుర్తు పెట్టుకోండి, ప్రజలందరికీ కూడా మోటివేటర్లు గా ఉంటూ  ప్రభుత్వానికి అండగా నిలబడాలని పిలుపునిస్తున్నాను” వంటూ వారికి కర్తవ్యం బోధించారు.

ప్రతి ఇంటికీ ఎక్కువసార్లు వెళ్లాలని, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడాను వారికి చూపించాలని విజ్ఞప్తి చేశారు. చేసిన మంచిపై ప్రజలు ఆలోచించేలా చేయాల్సిన బాధ్యత మీదే అంటూ వారికి స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్