Friday, March 29, 2024
HomeTrending Newsపారిశ్రామిక వేత్తలకు అందుబాటులో.. : సిఎం జగన్

పారిశ్రామిక వేత్తలకు అందుబాటులో.. : సిఎం జగన్

పారిశ్రామికవేత్తలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అండగా ఉంటుందని, వారికి ఎప్పుడు ఎలాంటి సాయంకావాలన్నాఒక్క ఫోన్ కాల్ చాలని… తాము అందుబాటులోకి వస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు.  ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు రాష్ట్రం ఒక తార్కాణంగా నిలుస్తోందని, తాము ఎంత వేగంగా  నిర్ణయాలు తీసుకున్తున్నామనేది సీపీ గుర్నానీ లాంటి వ్యక్తులు  స్వయంగా చూశారు కాబట్టి వారు మరిన్ని పరిశ్రమలు ఇక్కడకు రావడంలో తోడ్పాటు అందిస్తారని సిఎం ఆశాభావం వ్యక్తం చేశారు.  తూర్పు గోదావ‌రి జిల్లా గోకవరం మండలం గుమ్మళ్ళదొడ్డి వద్ద రూ.270 కోట్లతో   ఏర్పాటు చేస్తోన్న అస్సాగో బయో ఇథనాల్‌ ప్లాంట్‌కు వైఎస్ జగన్‌ భూమి పూజ నిర్వహించారు.  అసాగో ఇండస్ట్రీస్‌ ఎండీ, సీఈవో అశీష్‌ గుర్నానికి, అతని తండ్రి టెక్‌ మహేంద్ర ఎండీ, సీఈవో సీపీ గుర్నానీకి సిఎం అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో జగన్ మాట్లాడుతూ… తాను దావోస్‌ వెళ్లినప్పుడు గుర్నాని తనను కలిసి తన కుమారుడు ఆశీష్ ఇథనాల్‌ ప్లాంట్‌ పెట్టాలనే ఆలోచన చేస్తున్నారని, ఏపీలో ఇది పెడితే ఎలా ఉంటుందని అడిగారని, ప్లాంట్ పెట్టాల్సిందిగా తాను కోరానని సిఎం జగన్ చెప్పారు. కేవలం 6 నెలల కాలంలోనే పరిశ్రమకు సంబంధించి భూ సేకరణ చేసి నేడు భూమి పూజ చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు.  ఏపీలో ఈజ్‌ డూయింగ్‌ బిజినెస్  ఏ స్థాయిలో జరుగుతుందో  తెలియజెప్పడానికి ఇది తార్కాణమని పేర్కొన్నారు.  2 లక్షల లీటర్ల కెపాసిటీతో నిర్మాణమవుతోన్న ఈ ప్లాంట్‌  ఏర్పాటుతో 300 వందలమందికి పైగా స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. రైతాంగానికి కూడా ఈ ప్లాంట్‌ చాలా మేలు చేస్తుందన్నారు.  తుఫాన్లు, వరదలు వచ్చినప్పుడు ధాన్యం రంగు మారిపోవడం, ముక్కి పోవడం, విరిగిపోయిన నూకలుగా మారుతుందని, ఈ సమస్యకు ఇక్కడి  ప్లాంట్‌ పరిష్కారం ఇస్తుందని వెల్లడించారు. రంగుమారిన ధాన్యానికి కూడా మంచి రేటు ఇప్పించగలుగుతామని, రైతులకు కూడా మంచి జరుగుతుందని చెప్పారు. ఈ ప్లాంట్‌ ద్వారా ఎలాంటి కాలుష్యం కూడా ఉండదని, పశువులు, కోళ్ళకు దాణా, చేపలకు మేత కూడా అందుబాటులోకి వస్తుందని సిఎం జగన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు గుడివాడ అమర్నాధ్, తానేటి వనిత, దాడిశెట్టి రాజా, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ రామ్, చింతా అనురాధ, వంగా గీత, స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు పాల్గొన్నారు.

Also Read : ఈజ్ ఆఫ్ డూయింగ్ లో మళ్ళీ ఏపీ టాప్

RELATED ARTICLES

Most Popular

న్యూస్