Thursday, April 25, 2024
Homeసినిమామాతృక నుంచి బయటికొచ్చి చేశాం : త్రివిక్రమ్‌ ‌

మాతృక నుంచి బయటికొచ్చి చేశాం : త్రివిక్రమ్‌ ‌

Success Meet: పవన్‌కళ్యాణ్‌, రానా ద‌గ్గుబాటి కాంబినేషన్‌లో సాగ‌ర్ కె చంద్ర తెర‌కెక్కించిన చిత్రం భీమ్లా నాయ‌క్. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకం పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ చిత్రానికి త్రివిక్రమ్‌ మాటలు, స్ర్కీన్‌ప్లే అందించారు. ఈ నెల 25న‌ భీమ్లా నాయక్‌ చిత్రం ప్రభంజనంలా ఘన విజయం బాటలో పయనిస్తోంది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ హిట్‌ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ సంద‌ర్భంగా ఈ చిత్రం పవర్‌ఫుల్‌ సక్సెస్‌ మీట్‌ హైదరాబాద్‌లో జరిగింది.  చిత్ర యూనిట్‌ తమ ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ “మేం తీసిన సినిమాను మీడియా భుజాన వేసుకుని జనాల్లోకి తీసుకెళ్లింది. మంచి సినిమా తీస్తే.. మీడియా సహకారం ఎప్పుడూ ఉంటుందని నిరూపించారు. మనస్ఫూర్తిగా మీడియాకు కృతజ్ఞతలు చెబుతున్నాను. ‘మాతృకలో కథ అంతా కోషి వైపు నుంచి చెప్పబడింది. భీమ్లానాయక్‌ వైపు తీసుకురావడానికి ఎలా బ్యాలన్స్‌ చేయాలి’ ఈ సినిమా రీమేక్‌ అనుకున్నప్పుడు మాకు ఎదురైన తొలి సవాల్‌ ఇది. కథను ఎలా మార్చుకురావాలి అన్న దాని పై మా చర్చలు మొదలయ్యాయి. అడవికి సెల్యూట్‌ చేస్తూ.. భీమ్లానాయక్‌ క్యారెక్టర్‌ను అడవికి మరింత దగ్గర చేస్తే అతనికి జస్టిఫికేషన్‌ దొరుకుతుందనిపించింది.

మాతృక నుంచి బయటకు రావడానికి మేం చాలా ప్రయత్నాలు చేశాం. చివరికి భీమ్లా అయినా ఉండాలి.. లేదా డ్యాని అయినా ఉండాలి… లేదంటే ఇద్దరూ ఫ్రేమ్‌లో ఉండాలి. అందుకే క్లైమాక్స్‌ వచ్చేసరికి ఇద్దరూ ఉండేలా చేశాం. ఇద్దరికీ యూనిఫామ్‌ జర్నీ ఉండాలనుకున్నాం. భీమ్లా భార్య పెరగమంటుంది. డ్యాని భార్య తగ్గమంటుంది.. సరిగ్గా గమనిస్తే.. ప్రతి సీన్‌కు కౌంటర్‌ ఉంటుంది. ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ నుంచి బయటకు రావడానికి ఇవన్నీ చేశాం. మాతృక గొప్ప కథ. దృతరాష్ట్రుడిలా కౌగిలించుకుని వదిలిపెట్టకపోవడం అనేది గొప్ప కథ లక్షణం. మాతృక ప్రేమను చంపుకోవాలంటే ఇలాంటి ప్రయోగాలన్ని చేయాలి.

పవన్ కళ్యాణ్‌ లాంటి స్టార్‌తో సినిమా అంటే చాలా విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి. ఆయన్ని ఎలివేట్‌ చేయడానికి చేసే ప్రయత్నాలు ఆర్టిఫియల్‌గా ఉండకూడదు. అభిమానులు ప్రేక్షకులు కోరుకునే అంశాలు మిస్‌ కాకుండా ఉండాలి. అవన్నీ బ్యాలెన్స్‌ చేయడానికి మేం ఎక్కువ కష్టపడ్డాం. ఆ తర్వాత అన్ని ఈజీగా జరిగిపోయాయి. కరోనా ఒక్కటే మాకు గ్యాప్‌ వచ్చేలా చేసింది. అభిమానులు మెచ్చేలా పవన్‌ని తెర పై చూపించడానికి సాగర్‌ చాలా కష్టపడ్డారు. తనకి సపోర్ట్‌గా మేమంతా ఉన్నామని ధైర్యం చెప్పాం. కళ్యాణ్ గారికి తను చెప్పలేని విషయాలను వారధిలా ఉండి మేం చెప్పాం. కొవిడ్‌ సమయంలో పవన్ కళ్యాణ్‌, రానా ఎలాంటి భయం లేకుండా జనాల మధ్య పని చేశారు.

మా సినిమాకు మంచి ఆర్టిస్ట్‌లు, టీమ్‌ కుదిరింది. చిన్నచిన్న పాత్రలు కూడా ఎలివేట్‌ అయ్యారు. ప్రతి ఆర్టిస్ట్‌ స్ర్కిప్ట్‌ను చదివి మేం చెప్పినదాని కన్నా బాగా నటించారు. ఈ మధ్యకాలంలో వస్తున్న ఆర్టిస్ట్‌ల్లో చాలా పర్ఫెక్షన్‌ ఉంది. న్యూ జనరేషన్‌ ఆర్టిస్ట్‌లు ఎంతో టాలెంట్‌ ఉన్న వ్యక్తులని అర్థమవుతోంది. ఇప్పటితరం వాళ్లకు సినిమా పై ప్రేమ, ప్రతి విషయంలో వాళ్లకున్న అవగాహన గొప్పది. ఐదేళ్లుగా నేనీ విషయాన్ని గమనిస్తున్నా. ఇక డాన్స్‌ల విషయానికొస్తే గణేశ్‌ మాస్టర్‌ స్టెప్పులు బాగా కంపోజ్‌ చేశారు. 600 మందితో సాంగ్‌ షూట్‌ చేయడం సాధారణ విషయం కాదు. ఆ సాంగ్‌ షూట్‌ జరుగుతున్న సమయంలో సెట్‌లోకి వెళ్లగానే అంత మంది జనాన్ని చూసి భయం వేసింది. కానీ మూడు రోజుల్లో ఆ సాంగ్‌ పూర్తి చేశారు. సాగర్‌కు వచ్చిన ఐడియాతోనే మొగిలయ్యతో టైటిల్‌ సాంగ్‌ పాడించాం. ఆయనకు పద్మశ్రీ రావడం.. ఎంతో ఆనందం కలిగించింది. జానపద కళాకారులతో అనుకుని పాడించలేదు. అలా కుదిరాయంతే. తమన్‌ నేను కథ చెప్పగానే పాటలిచ్చేస్తాడు. అతను ఈ మధ్య సంగీతంతో మాట్లాడుతున్నాడు “అని త్రివిక్రమ్‌ అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్