Tuesday, June 16, 2026
HomeTrending NewsBRS vs BJP; బీజేపీ రాజకీయ డ్రామాలు - మంత్రి తలసాని విమర్శ

BRS vs BJP; బీజేపీ రాజకీయ డ్రామాలు – మంత్రి తలసాని విమర్శ

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల విషయంలో BJP నాయకులు రాజకీయ డ్రామాలు చేస్తున్నారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. గురువారం ఆదర్శ నగర్ లోని MLA క్వార్టర్స్ లో గల తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. దేశంలో పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఉచితంగా ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని వివరించారు. పేద ప్రజలు ఆత్మగౌరవంతో జీవించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అన్ని మౌలిక సౌకర్యాలు, వసతులతో కూడిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2.65 లక్షల ఇండ్లను, GHMC పరిధిలో లక్ష ఇండ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందని పేర్కొన్నారు. గతంలో పేదలకు నిర్మించిన ఇండ్ల కార్యక్రమంలో లబ్దిదారుడి వాటా, బ్యాంక్ రుణం, కొంత ప్రభుత్వ సహాయం ఉండేదని తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం లబ్దిదారుడిపై ఒక్క పైసా భారం లేకుండా ఉచితంగా నిర్మించి ఇస్తుందని వివరించారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని IDH కాలనీలోనే మొట్టమొదటగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించడం జరిగిందని చెప్పారు. ఇప్పటికే నగరంలోని సనత్ నగర్, కార్వాన్, ముషీరాబాద్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ తదితర నియోజకవర్గాలలో ఇండ్లను నిర్మించి ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కేంద్రమంత్రిగా, రాష్ట్ర BJP అద్యక్షుడిగా బాద్యతాయుతమైన పదవులలో ఉన్న కిషన్ రెడ్డి కి అధికారికంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను సందర్శించి పరిశీలించే అవకాశం ఉన్నప్పటికీ అలా కాదని రోడ్డుపై బైఠాయించాల్సిన అవసరం ఏముందని, ఏం ఆశించి ఎందుకోసం ఈ రాద్దాంతం చేస్తున్నారో చెప్పాలని మంత్రి శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు.

ఇండ్లను లబ్దిదారులకు పంపిణీ చేస్తామని ప్రకటించిన తర్వాత కూడా ఈ ఆందోళన ఎందుకు చేస్తున్నారో చెప్పాలని అన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం మీరు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. నిజంగా పేదలకు మేలు చేయాలనే ఆలోచన మీకు ఉంటే కేంద్ర ప్రభుత్వం నుండి ఎందుకు నిధులు తేలేకపోతున్నారని ప్రశ్నించారు. పేదల అభివృద్ధి, సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని అన్నారు. సొంత స్థలం ఉంది ఇల్లు నిర్మించుకోలేకపోతున్న పేదలకు అర్హులైన ఒకొక్కరికి 3 లక్షల రూపాయలు చొప్పున ఆర్ధిక సహాయం అందించే విధంగా గృహలక్ష్మి అనే నూతన కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభించున్నట్లు వివరించారు. ఒక్కో నియోజకవర్గ పరిధిలో 3 వేల మంది అర్హులకు ఈ ఆర్ధిక సహాయం అందించడం జరుగుతుందని చెప్పారు. కేవలం రాష్ట్ర ప్రభుత్వం పై బురద చల్లే ప్రయత్నంలో భాగంగానే రోడ్డుపై అర్ధం లేని ఆందోళన చేపట్టారని విమర్శించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రారంభ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొని ప్రశంసించిన విషయం వాస్తవం కాదా ? అన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, ఇక నైనా తమ వైఖరిని మార్చుకోవాలని హితవు పలికారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular