Saturday, March 7, 2026
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్రఘురామపై చర్య తీసుకోండి: స్పీకర్ కు భరత్ వినతి

రఘురామపై చర్య తీసుకోండి: స్పీకర్ కు భరత్ వినతి

నర్సాపురం ఎంపి రఘురామ కృష్ణంరాజుపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సిపి మరోసారి లోక్ సభ స్పీకర్ ఓం  బిర్లాకు విజ్ఞప్తి చేసింది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద నర్సాపురం నుంచి ఎంపీగా ఎన్నికై, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, అందువల్ల అయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని లోక్ సభలో వైఎస్సార్ పార్టీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపి  మార్గాని భరత్ ఫిర్యాదు చేశారు.

రఘురామకృష్ణరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ చేసిన వ్యాఖ్యలపై గతంలోనే ఆధారాలను తాము లోక్ సభ స్పీకర్ కు సమర్పించామని, అనేక పర్యాయాలు డిస్ క్వాలిఫికేషన్ కు సంబంధించి స్పీకర్ ను కలిసి విజ్ఞప్తి చేశామని, రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అతిక్రమించిన రఘురామకృష్ణరాజును వెంటనే డిస్ క్వాలిఫై చేయాల్సిందిగా ఈరోజు మరోసారి లోక్ సభ స్పీకర్ ను కలిసి విజ్ఞప్తి చేశామని భరత్ తెలిపారు.

సిఎం జగన్ రెండ్రోజుల ఢిల్లీ పర్యటన సమయంలోనే భరత్ స్పీకర్ ను కలవడం విశేషం. నిన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను కలుసుకున్న సమయంలో రఘురామ వ్యవహారం కూడా చర్చకు వచ్చి ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. గతంలో అనేక సార్లు రఘురామపై చర్య తీసుకోవాలని వైఎస్సార్సిపి ఫిర్యాదు చేసింది, తాజాగా మరోసారి స్పీకర్ ను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వచ్చే నెలలో పార్లమెంట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఈ లోగా చర్య తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోరుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular