సమసమాజం కోసం, పేద వర్గాల అభ్యున్నతి కోసం ఎంతవరకైనా ముందుకు వెళ్ళే విప్లవాత్మక ఆలోచన సిఎం జగన్ తప్ప మరొకరికి సాధ్యం కాదని ఎమ్మెల్యే గొల్ల బాబురావు స్పష్టం చేశారు. జగన్ ఓ గొప్ప సంస్కర్త, కారణజన్ముడు అంటూ అభివర్ణించారు. దళిత సామాజిక వర్గానికి చెందిన తనలాంటి ఓ సామాన్య వ్యక్తిని పెద్దల సభకు పంపడం జగన్ ఆలోచనా విధానానికి నిదర్శనమని కొనియాడారు. రాజ్యసభ ఎన్నికలకు వైసీపీ తరఫున మాజీ ఎంపి, టిటిడి మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, మేడా రఘునాథ్ రెడ్డి లు నేడు నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు వారు సిఎం జగన్ ను కలుసుకున్నారు. వారిని అభినందించిన జగన్ బి-ఫారంలు అందజేశారు.
రాజ్యసభ ఎన్నికల్లో మూడు సీట్లూ తాము గెల్చుకుంటామని, దానికి తగిన సంఖ్యాబలం తమకుందని వైవీ సుబ్బారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తమ నాయకుడు సిఎం జగన్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రాష్ట్ర సమస్యల కోసం పోరాటం చేస్తామని వెల్లడించారు.