Sunday, March 15, 2026
HomeTrending NewsYSRCP: ఒంగోలులో వినూత్నంగా సామాజిక సాధికార యాత్ర

YSRCP: ఒంగోలులో వినూత్నంగా సామాజిక సాధికార యాత్ర

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర నేడు రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ఘనంగా జరిగింది. ఒంగోలు జిల్లా కేంద్రంతో పాటు నంద్యాల జిల్లా బనగానపల్లె, విశాఖ దక్షిణ నియోజకవర్గంలో భారీ సంఖ్యలో ప్రజలు హాజరై తమ మద్దతు తెలిపారు. ఒంగోలులో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన యాత్రలో పార్టీ 5 జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్ మరియు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి , ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి, మునిసిపల్ శాఖ మాత్యులు ఆదిమూలపు సురేష్, సోషల్ వెల్ఫేర్ మంత్రి వర్యులు మేరుగ నాగార్జున, ఆరోగ్య శాఖ మాత్యులు శ్రీమతి విడదల రజిని, జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ, పార్లమెంట్ సభ్యులు, తదితర శాసనసభ్యులు, కార్యకర్తలు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

వివిధ బిసి కుల వృత్తులు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన పథకాలను వివరిస్తూ ఏర్పాటు చేసిన ప్రత్యేక శకటాల ఆకట్టుకున్నాయి. మధ్యలో వర్షం పడుతున్నా లెక్క చేయకుండా నాయకుల ప్రసంగాలను ప్రజలు, పార్టీ శ్రేణులు  ఆలకించడం గమనార్హం. ఈ యాత్రకు లభించిన స్పందన చూసి నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు.

విశాఖ దక్షిణ నియోజకవర్గంలో 

ప్రజలందరినీ సరి సమానంగా చూడాలని పరితపించే సీఎం జగన్ సామాజిక సాధికారతను ప్రతిష్టాత్మకంగా చేపట్టారని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ అన్నారు. ప్రతీ పేదవాడిని ఆర్థికంగా బలంగా నిలబెట్టేందుకు దమ్ముతో ధైర్యంగా రాజకీయంగా తలెత్తుకుని తిరిగేలా నిర్ణయం తీసుకున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ మాత్రమేనని స్పష్టం చేశారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర  ఉత్సాహంగా సాగింది. విశాఖ నగరంలోని డైమండ్ పార్కు నుంచి డాబాగార్డెన్స్, జగదాంబ ,పూర్ణామార్కెట్ మీదుగా టౌన్ కొత్త రోడ్డు  యాత్ర చేరుకుంది.  అనంతరం ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్ అధ్యక్షతన జరిగిన బహిరంగసభలో స్పీకర్ తమ్మినేని సీతారామ్, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్, ఐటీ మంత్రి గుడివాడ అమర్ నాథ్, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణ, వక్ఫ్ బోర్డు చైర్మన్ ఖాదర్ భాషా,  ఎమ్మెల్సీలు వరుదు కల్యాణీ, వంశీకృష్ణ శ్రీనివాస్ లు పాల్గొన్నారు.

మోపిదేవి మాట్లాడుతూ… మానవ తప్పిదంగా ఫిషింగ్ హార్బర్ లో అగ్ని ప్రమాదం చేటుచేసుకుంటే సీఎం జగన్ హుటాహుటిన స్పందించి బాధితులకు నూటికి 80 శాతం సాయం చేస్తామని ప్రకటన చేసి తానున్నానే అభయమిచ్చారన్నారు. హుదూద్ బాధితులకు ఇప్పటికీ పరిహారాన్ని టీడీపీ అందించలేకపోయిందని విమర్శించారు. చంద్రబాబు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తే, కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునేందుకు జగన్ ముందడుగు  వేస్తున్నారన్నారు.

ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్ మాట్లాడుతూ మత్స్యకారుడునైన నన్ను సీఎం మూడోసారి ఎమ్మెల్యే చేయడానికి సిఎం జగన్ సంకల్పించారని, వచ్చే ఎన్నికల్లో తనను మరోసారి గెలిపించాలని కోరారు. గత పాలకులు కులాలను విభజించి బానిసులగా చేసుకుని స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటే, సీఎం జగన్ మాత్రం అన్ని జాతులకు సమ ప్రాధాన్యతనిస్తూ అగ్ర వర్ణాలకు ధీటుగా అన్ని రంగాల్లో అవకాశాలు కల్పిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి ఆశీస్సుల మేరకు నియోజకవర్గంలో ప్రజలకు ఏ కష్టం వచ్చినా సరే తక్షణమే పరిష్కరించే బాధ్యత తనదేనంటూ ప్రజల సమక్షంలో ప్రమాణం చేశారు.

బనగానపల్లెలో 

నలభైఏళ్ల రాజకీయాల అనుభవం వుందని చెప్పుకుంటూ, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశానని చెప్పుకుంటూ తిరుగుతున్న బాబు పేదలకు, అణగారిన వర్గాలకు చేసింది ఏమీలేదని తిరుపతి ఎంపి గురుమూర్తి విమర్శించారు. ఈ నాలుగున్నరేళ్లలోనే ముఖ్యమంత్రి జగనన్న ప్రజలకు ఎంతో మేలు చేశారని, లెక్కలేనన్ని సంక్షేమ పథకాలు తెచ్చారని వివరించారు. అణగారిన వర్గాలు రాజ్యాధికారంలో భాగమైతేనే అభివృద్ధి చెందుతాయని, తన మంత్రి వర్గంలో ఐదుపదవుల్ని ఎస్సీలకే ఇచ్చారన్నారు. శాసనమండలి ఛైర్మన్‌ను కూడా ఎస్సీ వర్గానికే కేటాయించారని, నామినేటెడ్‌ పదవుల్లో సింహభాగం ఇచ్చిన మనసున్న మనిషి ముఖ్యమంత్రి జగనన్న అని పేర్కొన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో సామాజిక సాధికార యాత్ర జైత్రయాత్రలా సాగింది. మైనారిటీలతో సమావేశం, మీడియా సమావేశం అనంతరం..సభాస్థలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎంలు నారాయణస్వామి, అంజాద్‌బాషా, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డి, ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదన్, జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ తదితరులు పాల్గొన్నారు.

సీనియర్ ఎమ్మెల్యే రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు ఎంత గొప్పగా జరుగుతోందో ప్రత్యక్షంగా చూస్తున్నామని, దివంగత నేత రాజశేఖరరెడ్డిగారి సంక్షేమ పథకాల ఒరవడిని మరింత పెంచిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిదని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వ పనితీరును, ఈ ప్రభుత్వం పనితీరును ఒక్కసారి బేరీజు వేసుకోవాలని ప్రజలకు సూచించారు. సంక్షేమ పథకాలు అందాలంటే గతంలో ఎంతో కష్టపడాల్సివచ్చేది. ఇప్పుడు జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ఇంటి చెంతకే పథకాలు అందుతున్నాయని చెప్పారు. సీఎం జగన్‌ చేస్తోన్న మేలు మరిచిపోవద్దని, మళ్లీ ఆయన్ను సీఎం చేసుకుని కృతజ్ఞతలు చాటుదామని పిలుపు ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular