దిశా చట్టం ఆమోదించండి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపిన దిశా బిల్లు వెంటనే ఆమోదించాలని కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖమంత్రి స్మృతి ఇరానీకి వైఎస్సార్సీపీ విజ్ఞప్తి చేసింది. నేడు పార్లమెంట్ ఆవరణలో వైఎస్సార్‌ సీపీ మహిళా ఎంపీలు స్మృతి ఇరానీతో సమావేశమయ్యారు. దిశ బిల్లు అమలుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ బిల్లు ప్రస్తుతం కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిశీలనలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని వివరణలు ఈ మంత్రిత్వ శాఖ కోరింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తగిన సమాచారం పంపించింది. ఈ నేపధ్యంలో ఎంపీలు కేంద్ర మంత్రిని కలిసి త్వరగా బిల్లును కేంద్ర హోం శాఖకు పంపాలని కోరారు.

అనంతరం వైసీపీ మహిళా ఎంపీలు మాట్లాడుతూ ‘‘ హోంశాఖ, న్యాయశాఖలకు దిశ బిల్లు వివరాలు ఇప్పటికే అందజేశాం. మహిళలు, శిశువులకు రక్షణ కల్పించేలా దిశ బిల్లు రూపొందించాం. మహిళలపై నేరాలకు పాల్పడిన వారికి 21 రోజుల్లోనే శిక్షపడేలా బిల్లు ఉంది. మహిళా సంక్షేమానికి సీఎం జగన్ ఎంతగానో కృషిచేస్తున్నారు. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ సానుకూలంగా స్పందించారు. మహిళా అభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వం చేస్తున్న కృషిని స్మృతి ఇరానీ ప్రశంసించారు’’ అని తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *