Wednesday, April 17, 2024
HomeTrending Newsకేంద్ర మంత్రితో టిడిపి ఎమ్మెల్యేల భేటి

కేంద్ర మంత్రితో టిడిపి ఎమ్మెల్యేల భేటి

వెలిగొండ ప్రాజెక్టుపై ప్రకాశం జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఢిల్లీలో  కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ని కలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన గెజిట్ లో వెలిగొండ ప్రాజెక్టును చేర్చకపోవడంపై వారు అభ్యంతరం తెలియజేశారు. ప్రకాశం జిల్లా కరువు పరిస్థతిని, జిల్లా నైసర్గిక స్వరూపాన్ని, వెలుగొండ ప్రాజెక్టు ప్రాధాన్యతను సవివరంగా కేంద్రమంత్రికి ఎమ్మెల్యేలు వివరించారు.

వెలిగొండ ప్రాజెక్టుకు అనుమతులు, నిధులు మంజూరు చేయవద్దంటూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసిన విషయాన్ని కూడా నేతలు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్ళారు. ఇలాంటి ఇబ్బందులు తొలగాలంటే తక్షణమే అనుమతి పొందిన ప్రాజెక్టుగా కేంద్ర గెజిట్‌లో చేర్పించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవి కుమార్, బాల వీరంజనేయులు, ఏలూరి సాంబశివరావులతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఉన్నారు.

వెలిగొండను గెజిట్ లో చేర్చడంపై గజేంద్ర సింగ్ షెకావత్ సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యేలు వెల్లడించారు. కేవలం రాజకీయం కోసమే తెలంగాణ ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్టుపై రాద్ధాంతం చేస్తోందని వారు ఆరోపించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్