Friday, March 29, 2024
HomeTrending Newsకూన రవిపై ప్రివిలేజ్ కమిటీ ఆగ్రహం

కూన రవిపై ప్రివిలేజ్ కమిటీ ఆగ్రహం

తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ప్రభుత్వ విప్ కూన రవికుమార్ పై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈరోజు జరిగిన సమావేశానికి అయన హాజరు కాకపోవడాన్ని తీవ్రంగా పరిగణించింది. ఆయనపై చర్యలకు త్వరలోనే నిర్ణయం తీసుకుని, రాబోయే సమావేశాల్లో సభ ముందు ఉంచుతామని ప్రివిలేజ్ కమిటి ఛైర్మన్ కాకాణి గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు.

స్పీకర్ తమ్మినేని సీతారాం పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కూన రవి తో పాటు ఎమ్మెల్యే, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడులకు కమిటీ నోటీసులు ఇచ్చింది. వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కోరింది. గత సమావేశానికి కూడా వీరిద్దరూ హాజరు కాలేదు. ఇతర అభియోగాల్లో టిడిపికి చెందిన మరో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, రాష్ట్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ లకు కూడా ప్రివిలేజ్ కమిటీ నోటీసులు ఇచ్చింది.

మరోవైపు, వ్యక్తిగత కారణాలతో ఈరోజు జరిగే సమావేశానికి తాను హాజరు కాలేనని అచ్చెన్నాయుడు కమిటీ కి సమాచారం అందించారు. అయితే రవికుమార్ నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. సెప్టెంబర్ 14 న మరోసారి సమావేశం కావాలని కమిటీ నిర్ణయించింది. దీనికి హాజరు కావాలని అచ్చెన్నాయుడుకు సమాచారం పంపనున్నారు.

తనకు ఇచ్చిన నోటీసుకు సంబంధించి పూర్తి సమాచారం ఇవ్వాలని రామానాయుడు,  తన వ్యాఖ్యలు సభా హక్కుల ఉల్లంఘన కిందకు ఎలా వస్తాయో తెలపాలని నిమ్మగడ్డ….ప్రివిలేజ్ కమిటీని కోరారు. వారు కోరిన సమాచారాన్ని పంపాలని అసెంబ్లీ అధికారులకు కమిటీ సూచించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్