Friday, March 29, 2024
HomeTrending Newsకొవిడ్‌తో సహజీవనం... కొనసాగించాల్సిందే

కొవిడ్‌తో సహజీవనం… కొనసాగించాల్సిందే

‘‘అమెరికాలో 5 ఏళ్ల చిన్నారులకు కూడా టీకా అందుబాటులో ఉంది. 12 ఏళ్లు పైబడినవారికి ఇటీవలే మూడో డోసుకు అనుమతించారు. అక్కడ ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రభావం పిల్లలపై ఎక్కువగానే ఉంది. అమెరికాలో ప్రస్తుతం మొత్తం పాజిటివ్‌ల్లో 22 శాతం కేసులు పిల్లల్లోనే. ఇది గతంలో 5 శాతంలోపే ఉండేది. భారత్‌లోనూ పిల్లలపై ఒమిక్రాన్‌ ప్రభావం ఎక్కువగానే కనిపించే అవకాశాలున్నాయి. త్వరలో భారత్‌లోనూ మూడోదశ ఉధ్ధృతికి అవకాశాలు ఎక్కువే. ఒమిక్రాన్‌ విషయంలో అప్రమత్తత అవసరం’’ అని భారత సంతతి అమెరికా వైద్యుల సంఘం (ఆపీ) అధ్యక్షురాలు డాక్టర్‌ అనుపమ గొట్టిముక్కల వెల్లడించారు. వరంగల్‌లో ప్రాథమిక విద్య, కాకతీయ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌, ఉస్మానియాలో పీజీ అనస్థీషియా పూర్తి చేసిన అనంతరం 22 సంవత్సరాల కిందట అమెరికాకు వెళ్లి అక్కడ పీడియాట్రిక్‌ అనస్థీషియాలో పట్టా పొందారు. ప్రస్తుతం భారత సంతతి అమెరికా వైద్యుల సంఘం అధ్యక్షురాలిగా సేవలందిస్తున్నారు. ఈనెల 5 నుంచి 7 వరకూ ఆపీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ‘గ్లోబల్‌ హెల్త్‌కేర్‌ సమ్మిట్‌’లో పాల్గొనేందుకు వచ్చిన డాక్టర్‌ అనుపమతో ముఖాముఖి.

శాస్త్ర సాంకేతిక వైద్య, విద్యా రంగాల్లో ముందున్న అమెరికాలోనూ ఎందుకు కొవిడ్‌ను నియంత్రించలేకపోతున్నారు?

ఒమిక్రాన్‌ వేరియంట్‌.. డెల్టా కంటే 4 రెట్లు అధిక వేగంతో వ్యాప్తి చెందుతోంది. అక్కడి ప్రజల్లో కొవిడ్‌ పట్ల ఉదాసీనత ఉంది. చాలామంది మాస్కులు పెట్టుకోవడం లేదు. 30-40 శాతం మంది ఇప్పటికీ అక్కడ కొవిడ్‌ టీకాలు తీసుకోలేదు. ఇటువంటి వారిలో కొవిడ్‌ తీవ్రత, వ్యాప్తి ఎక్కువగా ఉన్నాయి. ఒమిక్రాన్‌తో మరణాలు తక్కువ. సాధారణ జలుబు లక్షణాలే కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ ఉన్న అంచనాల మేరకు ఈ వేరియంట్‌తో కొవిడ్‌ బలహీనపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అమెరికాలో బూస్టర్‌ డోసు కూడా ఇచ్చారు కదా.. అయినా ఎందుకు వ్యాప్తి ఎక్కువ?

నిజానికి కొవిడ్‌ నివారించదగినదే. మాస్కు పెట్టుకుంటే రానే రాదు. టీకా కూడా తీసుకుంటే వ్యాప్తికి అవకాశాలు చాలా తక్కువ. అయితే ఒమిక్రాన్‌ వేరియంట్‌ టీకాల సామర్థ్యాన్ని కూడా ఛేదిస్తోంది. అందుకే వ్యాక్సిన్‌ వేసుకున్న వారికి కూడా వస్తోంది. కానీ వారిలో స్వల్ప జలుబు లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ప్రభావ తీవ్రత లేదు. డెల్టా వేరియంట్‌ సమయంలో కూడా వ్యాక్సిన్‌ 95 శాతం రక్షణ కల్పించింది. ఇతర అనారోగ్య సమస్యలున్న వారిలో కేవలం 5 శాతం మందికి మాత్రమే కొంత సమస్యను సృష్టించింది. ఆసుపత్రిలో చేరి చికిత్స పొందినవారిలో 95 శాతం మంది టీకాలు పొందని వారే. ఇన్‌ఫెక్షన్‌ సోకిన వారిలో సహజసిద్ధంగా రోగ నిరోధక శక్తి వచ్చినా.. అది ఆర్నెల్ల వరకే ఉంటోంది. దీంతో తిరిగి ఇన్‌ఫెక్షన్‌ బారినపడుతున్నారు. ఒక్కటి మాత్రం నిజం. కొవిడ్‌ ఎక్కడికీ పోదు. దీంతో సహజీవనం కొనసాగించాల్సిందే. ఆర్నెల్లకోసారి బూస్టర్‌ డోసు వేసుకోక తప్పదు.

భారత్‌లో కొవిడ్‌ మూడోదశ ఉధ్ధృతి ఎలా ఉండబోతోంది?

భారత్‌లోనూ త్వరలోనే మూడోదశ వచ్చే అవకాశముంది. జనవరి నెలాఖరు, ఫిబ్రవరి తొలివారాల్లో గరిష్ఠ స్థాయికి చేరుకుంటుంది. అయితే మరణాల సంఖ్య తక్కువే ఉండొచ్చు. పరీక్షల సంఖ్య పెంచాలి. త్వరగా గుర్తించడం, చికిత్స పొందడం ద్వారా తీవ్ర దుష్ప్రభావాల బారినపడకుండా జాగ్రత్తపడొచ్చు. ఒక్కటే అర్థం చేసుకోవాలి. వ్యాక్సిన్‌ వేసుకున్నా, వేసుకోకపోయినా కొవిడ్‌ వస్తుంది. అయితే టీకా పొందినవారిలో ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం అతి స్వల్పం. మరణ భయం తక్కువ.

RELATED ARTICLES

Most Popular

న్యూస్