Friday, September 20, 2024
Homeస్పోర్ట్స్మరిన్ని పతకాలు: అనురాగ్ ఆశాభావం

మరిన్ని పతకాలు: అనురాగ్ ఆశాభావం

టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్ లో భారత ఆటగాళ్ళు మరిన్ని పతకాలు సాధిస్తారని కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆశాభావం వ్యక్తం చేశారు.  ఫిట్ ఇండియా మూవ్ మెంట్ రెండో వార్షికోత్సవం సందర్భంగా ఢిల్లీ లోని ధ్యాన చంద్ స్టేడియం లో జరిగిన ఫిట్ ఇండియా మొబైల్ యాప్ ఆవిష్కరణ కార్యక్రమంలో అయన పాల్గొన్నారు. ఆగస్టు 29న మేజర్ ధ్యాన్ చంద్ పుట్టినరోజును జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటున్న సందర్భంగా ధ్యాన్ చాంద్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనురాగ్. అనంతరం కాసేపు స్కిప్పింగ్ ఆడి సభికులకు, క్రీడాకారులను అలరించారు.

అనురాగ్ మాట్లాడుతూ జాతీయ క్రీడా దినోత్సవం రోజునే భవీనా పటేల్ రజత పతకం సాధించడం సంతోషంగా ఉందని, మన అథ్లెట్లు మరిన్ని పతకాలు సాధిస్తారన్న విశ్వాసం తనకుందని చెప్పారు. భారత దేశంలో క్రీడాకారులకు, క్రీడాభిమానులకు మేజర్ ధ్యాన్ చంద్  స్పూర్తిగా నిలుస్తారని, రెండేళ్ళ క్రితం ఆ మహనీయుడి జన్మ దినోత్సవం రోజునే ఫిట్ ఇండియా ఉద్యమాన్ని గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారని అనురాగ్ గుర్తు చేశారు.

నేడు ఆవిష్కరించిన యాప్ ద్వారా మనం రోజువారీ రోజు వారీ ఎంత సేపు నిద్ర పోతున్నాం, ఎన్ని మంచినీళ్ళు తాగుతున్నాం, ఎంత సేపు వ్యాయామం చేస్తున్నామనే అన్ని వివరాలు ఉంటాయని, యాప్ ద్వారా మన ఫిట్ నెస్ మెరుగుపర్చుకోవచ్చని అనురాగ్ ఠాకూర్ తెలియజేశారు. కేంద్ర క్రీడల శాఖ సహాయ మంత్రి నితీష్ ప్రామాణిక్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మరోవైపు, నేడు నిర్వహించిన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రధాని మోడీ కూడా మేజర్ ధ్యాన్ చంద్ ను స్మరించుకున్నారు. యువతకు క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతోందని, అంతర్జాతీయ పోటీల్లో మన క్రీడాకారులు సత్తా చాటుతున్నారని, ఇదే మనం ధ్యాన్ చంద్ కు ఇచ్చే గొప్ప నివాళి అని మోడీ కొనియాడారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్