Friday, March 20, 2026
HomeTrending Newsపరిణామాలు బాధాకరం: పురంధేశ్వరి

పరిణామాలు బాధాకరం: పురంధేశ్వరి

అసెంబ్లీ అనేది చట్టాలు చేయాల్సిన ఓ పవిత్రమైన స్థలమని, అలాంటి చోట భాష ఏవిధంగా దిగజారిందో ప్రజలందరూ చూస్తున్నారని..ఇది శోచనీయమని  బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి  పురంధేశ్వరి వ్యాఖ్యానించారు.  ప్రభుత్వ విధాన నిర్ణయాల మీద,  వాటి వల్ల ప్రజలపై పడే ప్రభావం మీద చర్చలు జరగాలి తప్ప కానీ దానికి భిన్నంగా సభలో పరిణామాలు జరుగుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామాలకు ఆ రెండు పార్టీలు బాధ్యత వహించాల్సి ఉంటుందని వైసీపీ, టిడిపిలను పరోక్షంగా ఉద్దేశించి చెప్పారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో సోము వీర్రాజుతో కలిసి మీడియాతో మాట్లాడారు.

అమరావతి రాజధానికి తాము కట్టుబడి ఉన్నామని, ఈ విషయంపై తమ పార్టీ రాష్ట్ర శాఖ తరఫున ఎప్పుడో తీర్మానం చేశామని స్పష్టం చేశారు. పాదయాత్రలో పాల్గొంటున్న రైతులపై పోలీసులు ప్రవర్తిస్తున్న తీరు సరికాదని, దాన్ని నిరసిస్తూ, యాత్రకు సంఘీభావంగా తాము అందరం ఈరోజు యాత్రలో పాల్గొంటున్నామని వెల్లడించారు. అమరావతి- అనంతపురం జాతీయ రహదారి, అమరావతి రింగ్ రోడ్ మంజూరు చేయడం ద్వారా రాజధానికి తాము మద్దతిస్తున్న విషయం తేటతెల్లమైందన్నారు.

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బిజెపి కట్టుబడి ఉందని, రాష్ట్ర విభజన జరిగినప్పటినుంచీ తాము ఇదే వైఖరితో ఉన్నామని, రాష్ట్రానికి పెద్దఎత్తున జాతీయ వైద్య, విద్యా సంస్థలు కేటాయించామని గుర్తు చేశారు. రాష్ట్రం విషయంలో బిజెపి ప్రభుత్వం ఏనాడూ మాట తప్పలేదని, మడమ తిప్పలేదని వ్యాఖ్యానించారు.

ఆర్ధిక లోటుకు సంబంధించి కూడా 1438  కోట్ల రూపాయలు రెండు నెలల క్రితం కేంద్రం విడుదల చేసిందని…. ప్రతి శాఖ, ప్రతి ఖాతా కింద రావాల్సిన నిధులు ఎప్పటికప్పుడు ఇస్తోందని విడుదల చేస్తోందని  చెప్పారు. ఈ విషయంలో రాష్ట్రానికి చెందిన పార్టీలు బిజెపిని దోషిగా చూపించే ప్రయత్నం చేస్తున్నాయని పురందేశ్వరి ఆరోపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular