Monday, September 23, 2024
HomeTrending Newsవిద్యార్జనతోనే ఉన్నత స్థానం - మంత్రి గంగుల

విద్యార్జనతోనే ఉన్నత స్థానం – మంత్రి గంగుల

Book Festival : జ్ఞాన సముపార్జనకు పుస్తకాలు ఎంతగానో దోహదపడతాయని, పుస్తకాలు చదవడం వల్ల నే ఎందరో గొప్ప వ్యక్తులు గా మారారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ బుక్ ఫేర్, తెలంగాణ బుక్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో కరీంనగర్ లోని  జ్యోతిరావు పూలే పార్క్ లో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను బుధవారం ఆయన ప్రారంభించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం మంత్రి మాట్లాడుతూ పుస్తకాలకు జీవం పోయాల్సిన అవసరం ఉందన్నారు. కవులు, కళాకారుల ఖిల్లా కరీంనగర్ జిల్లా అని తెలిపారు పుస్తకం సమాజాన్ని మార్చుతుందని పుస్తకాలు చదవడం వల్లనే ఎందరో వ్యక్తులు గొప్పవారు కాగాలిగారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పుస్తక ప్రేమికుడని, వేల పుస్తకాలను చదవడం వల్లనే తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాడని అన్నారు. జిల్లాకు చెందిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పుస్తకాలు చదవడంతో పాటు అనేక పుస్తకాలు రాసారని ఆర్థికవేత్తగా అంతర్జాతీయంగా పేరు గడించారని తెలిపారు. డాక్టర్ సి.నారాయణరెడ్డి గొప్ప కవిగా గుర్తింపు తెచ్చుకున్నారని, పద్మ విభూషణ్ శ్రీభాష్యం విజయసారథి సంస్కృత పండితుడిగా, నలిమెల భాస్కర్ బహు భాషావేత్తగా గుర్తింపు పొందారని అన్నారు. పిల్లలు పుస్తకాలు చదివేలా తల్లిదండ్రులు ప్రోత్సాహం అందించాలని అన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు, గురుకుల పాఠశాలలకు విజ్ఞానం పెంపొందించే పుస్తకాలను పంపిణీ చేస్తామని మంత్రి అన్నారు. పుస్తక ప్రదర్శనలో 50 స్టాళ్లలో ఏర్పాటుచేసిన 20 వేల పుస్తకాలను విద్యార్థులు, మహిళలు, ప్రజలు తిలకించి తమకు నచ్చిన ఏదైనా ఒక పుస్తకం కొనుగోలు చేయాలని మంత్రి సూచించారు.

బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి బుర్రా వెంకటేశం మాట్లాడుతూ ఇంట్లో పుస్తకాలు ఉంటే ఇంటికి వెలుగు వస్తుందని అన్నారు. పిల్లలకు పుస్తకాలు కొనిచ్చి చదవడం అలవాటు చేయాలని సూచించారు. దీనివల్ల పిల్లలు విజ్ఞానం పెంపొందించు- కుంటారని తెలిపారు. పుస్తకాలు చదవడం వల్ల మంచే జరుగుతుంది కానీ నష్టం జరగదని తెలిపారు. బాలికలను ఉన్నతంగా చదివించాలని, విజ్ఞానంతో కూడిన సమాజం ఆరోగ్యవంతంగా మారుతుందని అన్నారు.

తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్ లో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనలో భాగంగా వారం రోజుల పాటు మహిళా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ పుస్తకప్రియుడని, ఆయన ప్రోత్సాహం వల్లనే కరీంనగర్ లో పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశారని తెలిపారు. చదువుకుంటేనే పేదరికం నుంచి ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు నని, చదువు వల్లనే గొప్ప స్థాయికి చేరుకోవచ్చునని అన్నారు. పుస్తకాలు చదవడం వల్ల జ్ఞానం అలవడుతుందని, సంస్కృతి పెంపొందుతుందని అన్నారు. ఈనెల 4వ తేదీన సాహిత్య అకాడమీ పక్షాన అన్ని పాఠశాలల్లో మన ఊరు -మన చెట్లు అనే అంశంపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శన లో భాగంగా మహిళల కోసం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి జరిగే మహిళల కార్యక్రమానికి మహిళలు పెద్ద ఎత్తున తరలిరావాలని అన్నారు. ప్రతిరోజు సాయంత్రం సాహితీ కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయని, తెలంగాణ వంటకాల స్టాల్స్ కూడా ఉంటాయని తెలిపారు.

ఈ సందర్భంగా విద్యార్థినులు ప్రదర్శించిన స్వాగత నృత్యం అలరించింది. ఎల్ ఎం డి కాలనీ ఎం జె పి పాఠశాల కు చెందిన అభినయ పాడిన పాట ఆకట్టుకుంది. బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ‘అమ్మా నాన్న ప్రేమ’ పై రాసిన పాట ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, మేయర్ సునీల్ రావు, సుడా చైర్మన్ జీవి రామకృష్ణ రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు గరిమ అగర్వాల్, జీవీ శ్యామ్ ప్రసాద్ లాల్, అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ మిట్టల్, జిల్లా సంక్షేమ అధికారి పద్మావతి, డి ఆర్ డి ఓ శ్రీలత, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ జువేరియా,జిల్లా విద్యాశాఖాధికారి జనార్దన్ రావు, కార్పోరేటర్లు, సాహితీవేత్తలు, కవులు, రచయితలు, పుస్తకప్రియులు, మహిళలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్