Tuesday, September 24, 2024
HomeTrending Newsఢిల్లీకి గ్రేటర్ బిజెపి కార్పొరేటర్ లు

ఢిల్లీకి గ్రేటర్ బిజెపి కార్పొరేటర్ లు

తెలంగాణలో బలపడటమే టార్గెట్‌గా బీజేపీ జాతీయ నాయకత్వం పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే బీజేపీ జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లకు ఢిల్లీ నుంచి ఆహ్వానం అందింది. ప్రధాని నరేంద్ర మోదీతో కమలం కార్పొరేటర్లు సమావేశం కానున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి షెడ్యూల్‌ ఖరారైంది. మంగళవారం సాయంత్రం 4 గంటలకు కార్పొరేటర్లతో మోదీ భేటీ కానున్నారు.

ఈ సందర్భంగా తెలంగాణలో పార్టీ బలోపేతంపై కార్పొరేటర్లకు మోదీ దిశానిర్దేశం చేయనున్నట్టు సమాచారం. అలాగే మోదీని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మురళీధర్‌రావు సైతం కలవనున్నట్టు తెలిసింది. ఇక కార్పొరేటర్లతో పాటు బీజేపీ సంస్థాగతంగా ఉన్న రంగారెడ్డి అర్బన్‌, భాగ్యనగర్‌, మహంకాళి, గోల్కొండ, మేడ్చల్‌ అర్బన్‌, హైదరాబాద్‌ సెంట్రల్‌ జిల్లాల అధ్యక్షులు సైతం ఈ సమావేశంలో పాల్గొననున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.

వాస్తవానికి ప్రధాని మోదీ ఇటీవల హైదరాబాద్లోని ఐఎస్‌బీ వార్షికోత్సవానికి వచ్చినప్పుడే పార్టీ కార్పొరేటర్లను కలిసి చర్చించాలని భావించారు. అప్పుడు కుదరకపోవడంతో కార్పొరేటర్లు నిరాశ చెందారు. ఈ క్రమంలోనే పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఎవరూ నిరాశ చెందవద్దని, త్వరలోనే ప్రధాని మోదీతో భేటీ అవుదామని కార్పొరేటర్లకు హామీ ఇచ్చారు. ఇంత త్వరగా కలుస్తామని ఊహించలేదని కార్పొరేటర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ వచ్చాక జీహెచ్ఎంసీలో బీజేపీ నుంచి నలుగురు కార్పొరేటర్లు మాత్రమే ప్రాతినిధ్యం వహించారు. కాగా గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ సంఖ్య ఒకేసారి 48కి పెరిగింది. అందులో ఒకరు మృతి చెందడంతో బీజేపీ బలం 47గా ఉంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలోని సీట్లను ఈజీగా గెలవాలంటే క్షేత్ర స్థాయిలో కార్యకర్తల కృషి ఎంతో అవసరం. అందుకే ప్రధాని మోదీతో పార్టీ కార్పొరేటర్లకు భేటీ నిర్వహించినట్లయితే మరింత ఉత్సాహంగా పనిచేస్తారని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది.

Also Read : కెసిఆర్ కుటుంబానికే పదవులు-అమిత్ షా

RELATED ARTICLES

Most Popular

న్యూస్