Saturday, April 20, 2024
HomeTrending Newsమాది ధర్మపోరాటం : నిరంజన్ రెడ్డి

మాది ధర్మపోరాటం : నిరంజన్ రెడ్డి

తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కేసుల మీద కేసులు వేసిన కాంగ్రెస్, బీజేపీ నేతలు ఆంధ్రా అక్రమ ప్రాజెక్టుల మీద ఒక్క కేసు కూడా ఎందుకు వేయలేదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. ప్రాజెక్టులు పూర్తయితే  ముఖ్యమంత్రి కెసిఆర్ కు  కీర్తి దక్కుతుందన్న అక్కసు, దురుద్దేశం తప్ప కాంగ్రెస్, బీజేపీ నేతలకు మరో ఆలోచన లేదని ఆరోపించారు.  రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల సామేలు, టీఎస్ఐడీసీ చైర్మన్ ఈద శంకర్ రెడ్డి లతో కలిసి మంత్రుల నివాస సముదాయంలో మీడియాతో మాట్లాడుతూ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు.

శ్రీశైలం ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తి కోసం మాత్రమే నిర్మించిన ప్రాజెక్టన్న మంత్రి మద్రాసు నగరానికి తాగునీటి పేరుతో రాయలసీమకు, నెల్లూరుకు సాగు నీరు ఎత్తుకు పోతున్నారని ఆరోపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కృష్ణా నది నుండి నాడు కేటాయించిన 811 టీఎంసీల నీళ్లలో అత్యధిక నదీ పరివాహక ప్రాంతం ఉన్న (20 వేల స్వ్కయర్ మైళ్లు) తెలంగాణకు 299 టీఎంసీలు, కేవలం 9 వేల స్వ్కయర్ మైళ్లు పరివాహక ప్రాంతం ఉన్న  ఆంధ్రాకు 512 టీఎంసీలు కేటాయించడం పూర్తిగా అన్యాయమన్నారు. తెలంగాణకే  500 టీఎంసీలు కేటాయించాల్సిందన్నారు.

కృష్ణా బేసిన్ అవసరాలు తీరకుండానే అక్రమంగా ఆంధ్రా ప్రభుత్వం పెన్నా బేసిన్ కు నీటిని తరలించడం ముమ్మాటికీ అన్యాయం, అక్రమమని మంత్రి నిరంజన్ మండిపడ్డారు. కాళేశ్వరం నిర్మాణ సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అటు మహారాష్ట్ర , ఇటు చత్తీస్ ఘడ్ రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి, ఒప్పందాలు చేసుకుని నిర్మించారని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎవరితో చెప్పకుండా , ఎవరితో మాట్లాడకుండా అక్రమంగా ఏకపక్షంగా నిర్మిస్తున్నాడని ఆరోపించారు.

రాయలసీమ ఎత్తిపోతల  పథకం రాష్ట్ర విభజన చట్టంలో లేదన్న మంత్రి నిరంజన్ శ్రీశైలం డ్యాంను ఏకంగా ఖాళీ చేసేందుకు కుట్ర చేస్తున్నారని, 300 మీటర్ల వెడల్పుతో శ్రీశైలం రిజర్వాయర్ లో కాలువలు తవ్వి నదినే మలిపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దేంతో ఉమ్మడి పాలమూరు, నల్లగొండ, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలు తీవ్రంగా నష్టపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. బచావత్ ట్రిబ్యునల్ క్రిష్ణానదిలో తెలంగాణ ప్రాజెక్టులకు  కేటాయించిన నీటిని సంపూర్ణంగా వాడుకునేందుకే జోగుళాంబ బ్యారేజ్, భీమా ఇరిగేషన్ కాలువ ప్రతిపాదించామన్నారు. 854 అడుగుల వద్ద పోతిరెడ్డిపాడు కాలువ తవ్వి అక్రమంగా నీటిని తోడుకుంటున్నప్పుడు, 800 అడుగుల వద్ద రాయలసీమ ఎత్తిపోతల పథకం అక్రమంగా నిర్మిస్తున్నప్పుడు, 808 అడుగుల వద్ద ప్రజలకు అవసరమైన కరంటు ఉత్పత్తి చేస్తే తప్పేంటి ? పైగా కరంటు ఉత్పత్తి కోసమే కదా 808 అడుగుల వద్ద వెంట్స్ పెట్టిందని ప్రశ్నించారు.

గతంలో తెలంగాణ మంచినీటి అవసరాలను కూడా లెక్క చేయకుండా క్రిష్ణా డెల్టాకు నీళ్లిచ్చే ఉద్దేశంతో శ్రీశైలం ప్రాజెక్టు నుండి జలవిద్యుత్ ఉత్పత్తి చేసింది మరిచారా ? ఏడేండ్ల కరువులో కూడా క్రిష్ణా డెల్టాకు నీళ్లు వదిలింది వాస్తవం కాదా ?. ఆంధ్ర పండాలి – తెలంగాణ ఎండాలి…నాడు ఆంధ్రా పాలకుల వైఖరికి, ఇప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరికి ఏం తేడా లేదన్నారు. కేఆర్ఎంబీ బోర్డును హైదరాబాద్ లోనే ఏర్పాటు చేయాలని మంత్రి డిమాండ్ చేశారు.  కేంద్రం క్రియాశీలకపాత్ర పోషించకపోవడం, రెండు రాష్ట్రాల మధ్య ఉన్న అంశాలను పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. ఇప్పటికైనా నిర్దిష్ట కాలగడువు పెట్టి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ద్వారా కేటాయింపులు సత్వరమే జరిగేలా చూడాలని కోరారు.

జాతీయపార్టీలు కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించవా అని నిరంజన్ రెడ్డి అడిగారు. నదీజలాలు, ఉద్యోగాలలో తెలంగాణకు అన్యాయం కాంగ్రెస్ పాపమేనన్నారు. తెలంగాణకు చేసిన పాపం కడుక్కునే అవకాశం వచ్చినా కాంగ్రెస్ నేతలు విస్మరిస్తున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ మీద గాలిమాటలు మాట్లాడడం తప్ప వారికి తెలంగాణ ప్రయోజనాలపై చిత్తశుద్ది లేదని ఆరోపించారు.

ప్రధానికి లేఖలు రాయడం వల్ల సమస్య పరిష్కారమవుతుందనుకుంటే అనాలోచితం .. ఆంధ్రా ప్రభుత్వం తన చర్యలను సరిదిద్దుకోవాలన్న మంత్రి నిరంజన్ తెలంగాణది ధర్మపోరాటం .. మా హక్కులకోసం మేం పోరాడుతున్నామని స్పష్టం చేశారు. పులిచింతల వద్ద విద్యుత్ ఉత్పత్తి గురించి మాట్లాడేవారికి 60 ఏండ్లు తెలంగాణ గోస ఎందుకు పట్టలేదు ? తెలంగాణకు ఓ ప్రాజెక్టు ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు.

తెలంగాణ ప్రజలంత విశాల హృదయం ఈ దేశంలో ఎవరికీ లేదన్న మంత్రి నిరంజన్ రెడ్డి అరవై ఏండ్లు కళ్ళ  ముందు నుండి నీళ్లు వృధాగా పోతుంటే, ఈ ప్రాంత నాయకులే మోసం చేస్తున్నా మౌనంగా భరించారన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్