Tamilanadu: నీట్‌ వ్యతిరేక బిల్లు ఆమోదించను – గవర్నర్‌

నీట్‌ వ్యతిరేక బిల్లుకు ఎప్పటికీ ఆమోదం తెలుపనని తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి తేల్చిచెప్పారు. బిల్లుకు క్లియరెన్స్‌ ఇవ్వాల్సిన చివరి వ్యక్తిని తానేనని, అది జరుగబోదని స్పష్టం చేశారు. మన పిల్లలు పోటీలో అత్యుత్తమంగా ఉండాలని భావిస్తున్నానని అన్నారు. ప్రస్తుతం నీట్‌ బిల్లు ఆమోదం కోసం రాష్ట్రపతి వద్ద ఉన్నది. శనివారం చెన్నైలోని రాజ్‌భవన్‌లో నీట్‌లో టాప్‌ మార్కులు సాధించిన విద్యార్థులతో సమావేశం నిర్వహించారు.

బిల్లుపై ఓ విద్యార్థి తండ్రి అడిగిన ప్రశ్నకు గవర్నర్‌ పై విధంగా స్పందించారు. ‘నేను స్పష్టంగా చెబుతున్నాను. నీట్‌ బిల్లుకు నేను ఆమోదం తెలుపను. ఏదేమైనా ఈ అంశం ఉమ్మడి జాబితాలో ఉన్నందున, బిల్లు రాష్ట్రపతి వద్దకు వెళ్లింది. ఇది రాష్ట్రపతి మాత్రమే ఆమోదించే అంశం’ అని పేర్కొన్నారు. నీట్‌ నుంచి తమిళనాడును మినహాయించాలని కోరుతూ స్టాలిన్‌ ప్రభుత్వం గత ఏడాది బిల్లును ఆమోదించింది. ఈ బిల్లు ఆమోదం విషయంలో గవర్నర్‌, డీఎంకే ప్రభుత్వం మధ్య అప్పటి నుంచి విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *