Saturday, March 7, 2026
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్జనవరికి రామతీర్థం ఆలయం : వెల్లంపల్లి

జనవరికి రామతీర్థం ఆలయం : వెల్లంపల్లి

జనవరి నాటికి రామతీర్థం కొండపై రాముల వారి ఆలయ నిర్మాణం పూర్తి చేసి ప్రారంభిస్తామని రాష్ట్ర దేవాదాయ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు వెల్లడించారు. రామతీర్థం లోని శ్రీరాముల వారి ఆలయాన్ని మంత్రి దర్శించుకుని పూజలు నిర్వహించారు. నూతన ఆలయ నమూనాలను మంత్రి ఆవిష్కరించారు.

కొండపైన ఆలయ నిర్మాణానికి అవసరమైన వసతులు సమకూర్చి అనుకున్న సమయానికి పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నామని వెల్లంపల్లి వివరించారు. ఆగమ శాస్త్ర ప్రకారం పలువురు పండితులు, స్వామీజీ లను సంప్రదించి వారి సూచనలు, సలహాలు మేరకు శాస్త్రోక్తంగా రూ. 3 కోట్ల వ్యయంతో, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా పునర్నిర్మిస్తున్నామని వెల్లంపల్లి చెప్పారు. చిలకలూరిపేట నుంచి రాతి పని వారిని రప్పించి పూర్తి రాతి కట్టడంగా రూపొందిస్తున్నామన్నారు.

రాష్ట్రంలోని అన్ని దేవాలయాలను సిసి కెమెరాల పర్యవేక్షణలో వుంచి భద్రతను పటిష్టం చేశామని, దీనికోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నామని వెలంపల్లి పేర్కొన్నారు. మంత్రి వెంట ఆలయాన్ని దర్శించిన ఎం.పి. బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే బడుకొండ అప్పల నాయుడు, దేవాదాయ శాఖ కమిషనర్ అర్జున రావు, ప్రత్యేక అధికారి భ్రమరాంబ కూడా ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular