Thursday, March 28, 2024
HomeTrending Newsతెలంగాణలో పాగా వేసేందుకు బిజెపి ప్రణాళికలు

తెలంగాణలో పాగా వేసేందుకు బిజెపి ప్రణాళికలు

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లో శాసనసభ ఎన్నికలు ఉండగా బిజెపి నాయకత్వం హైదరాబాద్ లో జాతీయ కార్యవర్గ సమావేశాలు ఏర్పాటు చేయటం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్న దృష్ట్యా ఇప్పటి నుంచే బిజెపి శ్రేణులను పార్టీ నాయకత్వం కార్యోన్ముఖుల్ని చేస్తోంది. ఇటీవలి వరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర కు పార్టీ అగ్రనేతలు హాజరయ్యారు. బిజెపి రాష్ట్ర నాయకత్వం కెసిఆర్ ప్రభుత్వంతో అంశాల వారిగా డీ అంటే డీ అంటోంది. రాబోయే ఎన్నికల్లో సత్తా చాటి తెలంగాణలో పాగా వేయాలని కమలం అగ్రనేతలు వ్యూహ రచన చేస్తున్నారు.

రాష్ట్రంలో వచ్చే నెల 2,3,తేదీలలో జరుగనున్నబీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో హైదరాబాద్ వేదికగా క్యాడర్ ను సమాయత్తపర్చడాన్ని పార్టీ హై కమాండ్​ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. పార్టీ అగ్ర నేతలు పాల్గొనే ఈ భేటీ ద్వారా బహుళ ప్రయోజనాలు పొందాలని కమలం నేతలు ప్రణాలికలు సిద్దం చేస్తున్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను సానుకూలంగా మలచుకుని అధికారం కైవసం చేసుకోవడం, దక్షిణాదిలో పార్టీని సంస్థాగతంగా విస్తరించడం ఈ వ్యూహంలో భాగమే! పార్టీలో వన్, టూ, త్రీ అనదగిన ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు 18 రాష్ట్రాల సీఎంలు, పలువురు కేంద్ర మంత్రులు, జాతీయ కార్యవర్గ పదాధికారులు, వివిధ మోర్చాల అధినేతలు పాల్గొనే ఈ సమావేశాల ద్వారా తెలంగాణలో పార్టీ శ్రేణుల్ని మరింత ఉత్తేజపర్చి, అనుకూల వాతావరణాన్ని బలోపేతం చేయడం పార్టీ అగ్ర నాయకత్వం యోచనగా ఉంది.

ఇందుకుగాను తగినంత ముందుగానే ఏర్పాట్ల పర్యవేక్షణ, రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశానికి పూనుకుంది. పార్టీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ఈ రోజు (బుధవారం) హైదరాబాద్​ చేరుకున్నారు. బీజేపీ సమావేశాల ఏర్పాట్లను బీఎల్ సంతోష్ పరిశీలించి రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. కీలకమైన పార్టీ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు మోడీ, అమిత్ షా, నడ్డాతో పాటు సీఎంలు, కేంద్ర మంత్రులు, జాతీయ నేతలంతా కలిపి సుమారు వెయ్యి మంది లీడర్లు హైదరాబాద్ వస్తున్నారు. ఈ నేపథ్యంలో అగ్రనేతలు, పలువురు ప్రముఖులు బస చేసేందుకు హోటళ్లు, సమావేశాల వేదిక వంటి వాటిపై రాష్ట్ర నేతలతో సంతోష్ చర్చించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్