Monday, May 20, 2024
HomeTrending Newsఓటిఎస్ గతంలో ఎందుకు చేయలేదు? బొత్స

ఓటిఎస్ గతంలో ఎందుకు చేయలేదు? బొత్స

Botsa on Babu:
చంద్రబాబు రాజ్యాంగ బద్ధంగా పరిపాలన చేస్తే 23 సీట్లకు ఎందుకు దిగజారతారని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని అమలు చేసే వారు సరైన వ్యక్తులు కాకపోతే ఎలాంటి అనర్ధాలు జరుగుతాయో చెప్పడానికి చంద్రబాబే ప్రత్యక్ష ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. సిఎంగా 14 ఏళ్ళు పనిచేసి ఓటీఎస్ కింద ఇళ్ళను ఉచితంగా ఎందుకు ఇవ్వలేకపోయారని నిలదీశారు. షేర్ వాల్ టెక్నాలజీని హైదరాబాద్ లో కట్టిన ఇంటికి బాబు వినియోగించినట్టున్నారని,  షేర్ వాల్ టెక్నాలజీతో  ఆరు నెలల్లో నిర్మిస్తానన్న ఇళ్ళు రెండున్నరేళ్ళలో పునాదులు కూడా ఎందుకు దాటించలేదని, ఓటీఎస్ కింద రిజిస్ట్రేషన్లు తప్పు అని చెప్పడానికి చందబాబు ఎవరని బొత్స నిప్పులు చెరిగారు. ఓటిఎస్ పథకంపై  చంద్రబాబు చేస్తున్న విమర్శలపై బొత్స ఘాటుగా స్పందించారు.

మొన్న రోశయ్య గారు చనిపోయిన రోజున, ఈరోజున రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్థంతి రోజున చంద్రబాబు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడిన మాటలు చూశామని,  అంబేడ్కర్ గారి 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని 2016లో జీవో జారీ చేశానని చంద్రబాబు ఈరోజు చెబుతున్నారని, కానీ కాల్ మనీ కేసుల నుంచి దృష్టి మళ్ళించడానికే, అంబేడ్కర్ కు 125 అడుగుల విగ్రహం అంటూ ఈ సమయంలో చంద్రబాబు ఒక డైవర్షన్ ప్లాన్ ను అమలు చేశారని బొత్స ఆరోపించారు.

జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని పెట్టి.. ఓటీఎస్(వన్ టైం సెటిల్మెంటు) పేరుతో పేదలకు సంపూర్ణ హక్కులతో వారి పేర్లతో పక్కా ఇళ్ళను రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నామని … దీనిపై గతంలో కూడా పలు ప్రెస్ మీట్లలో చెప్పామని,  అడ్వర్టేజ్ మెంట్లు ఇచ్చామని, కరపత్రాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని బొత్స వివరించారు. ప్రభుత్వానికి సంబంధం లేకుండా, సంతబొమ్మాళిలో పంచాయతీ కార్యదర్శి ఇచ్చిన సర్క్యులర్ కు సంబంధించి ఇప్పటికే చర్యలు తీసుకున్నామని, ఈరోజు బొబ్బిలికి సంబంధించి 2-3 తరగతులు చదివే స్కూల్ కు వెళుతున్న ఓ విద్యార్థిని తీసుకొచ్చి రాజకీయం చేస్తున్నారని బొత్స మండిపడ్డారు. మీడియాలో తాటికాయంత అక్షరాలతో రాసిన వారు.. బొబ్బిలిలో మీ విలేఖర్లను పంపించి వాస్తవాలేమిటో, వారి తల్లిదండ్రులు ఏమి చెబుతున్నారో అడగాలాని బొత్స సూచించారు.

తాను  అధికారంలోకి వస్తే.. ఉచితంగా ఇస్తానంటున్న చంద్రబాబు,  14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పని చేసి ఎందుకు చేయలేదని ప్రశ్నించారు …? వైయస్ఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఇళ్ళ మీద వడ్డీలు తీసేశారని, వివిధ కార్పొరేషన్ లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రుణాలలో ప్రభుత్వ వాటాను తీసేశారు. ఇన్నేళ్ళు అధికారంలో ఉన్న మీకెందుకు అటువంటి ఆలోచన కూడా రాలేదని బాబును నిలదీశారు.

Also Read : పేదలకు ఓ హక్కు కల్పిస్తున్నాం: సజ్జల

RELATED ARTICLES

Most Popular

న్యూస్