Thursday, June 18, 2026
HomeTrending Newsసెస్‌ ఎన్నికల్లో గులాబీ గుబాళింపు

సెస్‌ ఎన్నికల్లో గులాబీ గుబాళింపు

సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం (సెస్) డైరెక్టర్ల ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. కొత్తగా ఎన్నికైన 15 మంది  డైరెక్టర్ల వివరాలతో కూడిన జాబితాను విడుదల చేశారు.  సిరిసిల్ల టౌన్ -1  డైరెక్టర్ గా  దిడ్డి రమాదేవి (BRS),  సిరిసిల్ల టౌన్ -2 డైరెక్టర్ గా లక్ష్మీనారాయణ (BRS) ఎన్నికయ్యారు.

వేములవాడ రూరల్ ఫలితాలపై గందరగోళం నెలకొంది. బీజేపీ అభ్యర్థి జక్కుల తిరుపతి విజయం సాధించారని ఎన్నికల అధికారి మమత ప్రకటించిన కాసేపటికే రీకౌంటింగ్కు ఆదేశించారు. ఫలితంపై అభ్యంతరం వ్యక్తంచేసిన బీఆర్ఎస్ నేతలు రీకౌంటింగ్కు పట్టుబట్టారు. దీంతో 15 నిమిషాల వ్యవధిలోనే ఎన్నికల అధికారి ఓట్లు మళ్లీ లెక్కించాలని నిర్ణయించారు. గందరగోళం మధ్యే వేములవాడ రూరల్ అభ్యర్ధిని ప్రకటించారు ఎన్నికల అధికారులు. బీజేపీ అభ్యర్థి జక్కుల తిరుపతి గెలిచినట్లు అధికారికంగా ప్రకటించారు. రుద్రంగిలో బీఆర్ఎస్ బలపరిచిన ఆకుల గంగారం అనే అభ్యర్థి 36 ఓట్లతో గెలిచారు. బీఆర్ఎస్ అభ్యర్థికి 523, స్వతంత్ర అభ్యర్థికి 487 ఓట్లు లభించాయి.

ఈనెల 24వ తేదీన (శనివారం)  సిరిసిల్ల సహకార విద్యుత్​ సరఫరా సంఘం(సెస్​) ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. ఉదయం 8 గంటలకు పోలింగ్​ మొదలుకాగా.. 13 మండలాలతో పాటు సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో ఉన్న 87,130 మంది ఓటర్లకు గాను 73,189 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 84 శాతం పోలింగ్ నమోదైంది. 15 డైరెక్టర్​ పోస్టుల కోసం జరిగిన ఎన్నికల్లో గెలవడానికి ప్రధాన పార్టీలు అన్ని ప్రయత్నాలు చేశాయి. మొత్తం 15 డైరెక్టర్ స్థానాలకు ప్రధాన పార్టీలతో పాటు ఇండిపెండెంట్లు, రెబెల్స్​ కలిపి 75 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు.

సెస్ ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ తో సహా అన్ని పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేశాయి. రెండు ప్రధాన శాసనసభ నియోజకవర్గాలతో పాటు ఇతర నియోజకవర్గాల్లో మరో రెండు మండలాల్లో సెస్ ఎన్నికలు రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా నిలిచాయి. పార్టీలకు అతీతంగా ఈ ఎన్నికలు జరిగినా, ఆయా పార్టీల మద్దతుతోనే అభ్యర్థులు బరిలో నిలిచారు.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular