Saturday, March 14, 2026
HomeTrending Newsకియా పేరుతో చంద్రబాబు అవినీతి - శంకరనారాయణ

కియా పేరుతో చంద్రబాబు అవినీతి – శంకరనారాయణ

ఉమ్మడి అనంతపురం జిల్లా పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆయన వయస్సుకు తగ్గట్లు లేవని మాజీ మంత్రి శంకరనారాయణ విమర్శించారు. సీఎం వైయస్‌ జగన్‌ చేస్తున్న మంచి పనులు, కార్యక్రమాలు చంద్రబాబుకు కనబడటం లేదా? అన్నారు. పెనుకొండలో ఈ రోజు జరిగిన ప్రెస్‌మీట్‌లో మాజీ మంత్రి శంకరనారాయణ  చంద్రబాబు తీరును తప్పుపట్టారు.

మాజీ మంత్రి శంకరనారాయణ ఇంకా మాట్లాడారంటే..:

నిజానికి ఆనాడు కియా కంపెనీ పేరుతో రైతులను చంద్రబాబు నట్టేట ముంచారు. రైతుల నుంచి ఒక్కో ఎకరా భూమి రూ.9–10 లక్షలకు కొట్టేసి, దాదాపు రూ.500 కోట్ల కుంభకోణం చేశారు. కియా కంపెనీ కోసం అంటూ 900 ఎకరాలు సేకరించి, ఆ భూమి చదును చేసినందుకు ఒక్కో ఎకరాకు రూ.30 లక్షలు వ్యయం చేసినట్లు చెప్పారు. ఆ విధంగా దాదాపు రూ.500 కోట్ల కుంభకోణం చేసిన మాట వాస్తవమా? కాదా?.

రెయిన్‌ గన్‌ల పేరుతోనూ దగా:
చంద్రబాబు ఎప్పుడు వచ్చినా కరువొస్తుంది. అనంతపురం జిల్లాలో కరువును ఎదుర్కోవడం కోసం అంటూ రెయిన్‌ గన్‌లు వినియోగించిన చంద్రబాబు, వాస్తవానికి ఒక్క ఎకరాకు కూడా నీరివ్వలేదు. కానీ ఆ పేరుతో ఏకంగా రూ.300 కోట్లు దుర్వినియోగం చేశారు. తన పాలనలో మా ప్రాంతానికి ఒక్క మేలు కూడా చేయని చంద్రబాబు, ఇక్కడి ప్రజలు, రైతులపై ఎంతో ప్రేమ ఉన్నట్లు మాట్లాడుతున్నారు.

చెరువులు నింపాం:
సీఎం వైయస్‌ జగన్, ఇక్కడి చెరువులు నింపడంతో పాటు, ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేలా పరిశ్రమల్లో స్థానిక యువతకు 75 శాతం ఇచ్చే విధంగా ఏకంగా చట్టమే చేశారు. ఇక హంద్రీనీవా గురించి కూడా చంద్రబాబు మాట్లాడుతున్నారు. పెనుకొండ, హిందూపురం, మడకశిర నియోజకవర్గాలతో పాటు, గొల్లపల్లి రిజర్వాయర్‌ కింద ఉన్న చెరువులన్నింటినీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాతే నింపాం.

ఏ వర్గానికైనా న్యాయం చేశారా?
అధికారం కోల్పోయిన చంద్రబాబు పిచ్చి ఎక్కినట్లు మాట్లాడుతున్నారు. సీఎంపై అర్ధం లేని విమర్శలు చేస్తున్నారు. ఈ ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఎంతో మేలు చేసింది. ఆ విషయం ధైర్యంగా చెప్పగలుగుతాం కూడా. కానీ చంద్రబాబు తన పాలనలో కనీసం ఏ వర్గానికైనా న్యాయం చేసారా?. రాష్ట్రాన్ని దోచుకోవడం తప్ప, ఆయన చేసిందేమీ లేదు. అలాంటి చంద్రబాబు ఇప్పుడు తాను మళ్లీ అధికారంలోకి వస్తే రాజధాని అమరావతిని, రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని చెబుతూ, మరోసారి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు.

మద్యానికి బానిస అవుతున్నాడేమో?:
చంద్రబాబు హయాంలోనే మద్యం ఏరులై పారింది. వందలాది మంది కల్తీ మద్యానికి బలయ్యారు. వీధి వీధికీ బెల్టు షాపు పెట్టి ప్రజలను లూటీ చేసిన వ్యక్తి చంద్రబాబు. ఆయన ఇటీవల మద్యం బ్రాండ్ల గురించి కలవరిస్తున్నారు. ఈమధ్య ఆయనకు నిద్ర లేదేమో. అందుకే మద్యానికి బానిస అవుతున్నాడేమో అనిపిస్తోంది.

సుపరిపాలన చూసి ఓర్వలేకపోతున్నారు:
రాష్ట్రంలో సీఎం వైయస్‌ జగన్‌ పాలన చూసి, ఓర్వలేకపోతున్న చంద్రబాబు, ఆయనపైనా, ప్రభుత్వంపైనా అర్ధం లేని విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే చంద్రబాబు మాటలు ప్రజలెవ్వరూ నమ్మరు. తెలుగుదేశం పార్టీని ప్రజలే బంగాళాఖాతంలో కలిపేస్తారు. దుష్ట చతుష్టయం చేస్తున్న దుష్ప్రచారాన్ని కూడా ఎవ్వరూ నమ్మరని మాజీ మంత్రి శంకరనారాయణ స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular