Saturday, April 20, 2024
HomeTrending Newsపథకాలకు సహకరించండి: సిఎం జగన్

పథకాలకు సహకరించండి: సిఎం జగన్

SLBC: Jagan 
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పథకాలకు బ్యాంకర్లు సహకరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సిఎం జగన్ అధ్యక్షతన క్యాంప్‌ కార్యాలయంలో 217 వ రాష్ట్ర స్ధాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిఎం జగన్ మాట్లాడుతూ ఏపీ ఇప్పుడు చాలా కీలక పరిస్థితుల్లో ఉన్న సమయంలో ఈ సమావేశం జరుగుతోందన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలు, కౌలు రైతులకు రుణాలు, ఎంఎస్ఏంఈలకు చేయూత, జగన్న తోడు, విద్యా రంగం నాడు-నేడు; వైద్య రంగం నాడు-నేడు; 16  కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం, మహిళా సాధికారత లాంటి అంశాల్లో  ప్రభుత్వానికి, తద్వారా లబ్దిదారులకు సహకరించాలని  కోరారు.

కోవిడ్‌ వ్యాప్తి తర్వాత దేశవ్యాప్తంగా ఇప్పుడిప్పుడే ఆర్థిక పరిస్థితి గాడిలో పడుతోందని,  ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటున్నాయని సిఎం అన్నారు. ఈ సమయంలోనే కరోనా థర్డ్‌ వేవ్, ఒమిక్రాన్‌ వేరియెంట్‌పై జరుగుతున్న ప్రచారం వల్ల ఆర్థికస్థితి మళ్ళీ కాస్త మందగించిందని, లేకపోతే ఈ పాటికే ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా గాడిలో పడి ఉండేదన్నారు. కరోనా థర్డ్‌ వేవ్‌ దేశ ఆర్థిక రంగంపై చాలా తక్కువ ప్రభావం చూపాలని సిఎం ఆకాంక్షించారు.

రెండేళ్లుగా కోవిడ్‌ వల్ల ఉత్పన్నమైన పరిస్థితులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపాయని, గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక పరిస్థితి మరింత దారుణంగా మారిందని ఒకవైపు ప్రభుత్వ ఆదాయం పూర్తిగా పడిపోవడం, మరోవైపు ప్రజల కనీస అవసరాలు తీర్చడం కోసం అధికంగా ఖర్చు చేయాల్సి రావడం వల్ల, ప్రభుత్వంపై భారం మరింత పెరిగిందని సిఎం చెప్పారు. కోవిడ్‌ వల్ల ప్రభుత్వ ఆదాయం 2019–20లో రూ.8 వేల కోట్లు, 2020–21లో రూ.14 వేల కోట్లు తగ్గిందని, మరోవైపు కోవిడ్‌ నివారణ, నియంత్రణ కోసం అదనంగా రూ.8 వేల కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చిందని… ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వంపై దాదాపు రూ.30 వేల కోట్ల భారం పడిందని సిఎం జగన్ వెల్లడించారు.

ఇలాంటి పరిస్థితుల్లో బ్యాంకింగ్‌ రంగం సహకారంతోనే రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితిని గట్టెక్కించగలిగిందని, కోవిడ్‌ సమయంలో కూడా పథకాలను అమలు చేసి సామాన్య ప్రజలను, నిరుపేదలను ఆదుకోగలిగిందని సిఎం బ్యాంకర్ల ను ప్రశంసించారు.  ఈ సహకారం లేకపోతే ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం చాలా కష్టమయ్యేదని అంటూ సహకరించినందుకు బ్యాంకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బ్యాంకుల సహకారం వల్లనే గ్రామీణ ఆర్థిక పరిస్థితి కూడా గాడిలో పడిందన్నారు. అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధితో పాటు, రాష్ట్రం అన్ని రంగాలలో పురోగమించేలా పలు చర్యలు చేపడుతున్నామని ఈ ప్రక్రియలో బ్యాంకులు కూడా ప్రభుత్వానికి తోడుగా నిలవాలని  సిఎం జగన్ విజ్ఞప్తి చేశారు.

Also Read : ఓటిఎస్ పై ప్రతిపక్షాల కుట్రలు: అవంతి

RELATED ARTICLES

Most Popular

న్యూస్