Wednesday, July 3, 2024
HomeTrending Newsమళ్ళీ మేమే వస్తాం - పూర్తి బడ్జెట్ పెడతాం : సిఎం జగన్ ధీమా

మళ్ళీ మేమే వస్తాం – పూర్తి బడ్జెట్ పెడతాం : సిఎం జగన్ ధీమా

ఎన్నికల నేపథ్యంలో మూడు నెలల కోసం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను రేపు ప్రవేశపెడుతున్నామని, వచ్చే ఎన్నికల్లో గెలిచి  తామే తిరిగి అధికారం చేపట్టి జూన్ లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడతామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో తాము ఓడిపోతామని చెబుతోన్న విపక్షాలు… నిజంగా అంత ధీమా ఉంటే  జత కట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. జాతీయ పార్టీలతో కూడా లోపాయికారీ అవగాహన కుదుర్చుకొని కుట్రలతో, పరువు దక్కించుకోవాల్సిన పరిస్థితులో తెలుగుదేశం పార్టీ ఉందని ఎద్దేవా చేశారు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన బాబు… తాను ఇది చేశా కాబట్టి ఓట్లు వేయమని చెప్పే సాహసం చేయలేకపోతున్నారని, తనకు మళ్ళీ ఛాన్స్ ఇస్తే ఇది చేస్తా, అది చేస్తా అని చెబుతున్నారని విమర్శించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో సిఎం జగన్ మాట్లాడారు. బాబు పేరు చెబితే గుర్తుకు వచ్చే పథకం ఒక్కటీ లేదన్నారు.

ప్రతి రాష్ట్రానికీ ఒక ఎకనామిక్ పవర్ హౌస్ ఉండాలని, ఒక హైదరాబాద్, ఒక బెంగుళూరు, ఒక చెన్నై లాంటి నగరాలు ఉండాలని, లేకపోతే రాష్ట్రానికి చెందిన ఆదాయాలు ఎప్పటికీ పెరగబోవని స్పష్టం చేశారు. అందుకే తాము విశాఖపై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నామని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా రాష్ట్రాన్ని విడగొట్టడమే కాకుండా చట్టంలో ప్రత్యేక హోదా అంశాన్ని  కూడా చేర్చలేదని, నాడు చట్టంలో పెట్టి ఉంటే  కోర్టుకు వెళ్లి అయినా దాన్ని సాధించుకునే అవకాశం ఉండేదని అభిప్రాయపడ్డారు. మనమీద ఆధారపడి ఉండే ప్రభుత్వం కేంద్రంలో వస్తే తప్ప హోదా అనేది సాధ్యం కాని పరిస్థితుల్లో ఉందని, కానీ ఇప్పుడు హోదా అనేది ఎండమావిగా మారిందని అన్నారు.

వైఎస్సార్సీపీ చేయగలిగిందే చెబుతుందని, చెప్పింది ఏదైనా కూడా చేసి మాటమీద నిలబడుతుందని పేర్కొన్నారు. ప్రజల మన్ననలు పొంది అఖండ మెజార్టీతో విజయం సాధించి ఇదే సభలో అడుగుపెట్టి మూడు నెలల తర్వాత పూర్తి బడ్జెట్ పెడతామని వివరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్